ఎంపీ కేశినేని నానీ వ్యంగ్యం .. జగన్ అండ్ గ్యాంగ్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఏపీలో తాజా పరిణామాల నేపధ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నానీ వైసీపీ సర్కార్ పై విమర్శలు చేశారు . క్రిస్మస్ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. 'ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అనిశ్చితిలో పడేసిన జగన్ & గ్యాంగ్ వైసీపీ పార్టీకి ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు.. రాష్ట్రం ఏమి అయినా ఫర్వాలేదు.. మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని క్రిస్మస్ సందర్భంగా భగవంతుడిని కోరుకోండి అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో మూడు రాజధానులపై రగడ కొనసాగుతున్న నేపధ్యంలో ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒక పక్క రాజధాని ప్రాంత 29 గ్రామాల రైతులు రాజధాని తరలించవద్దని ఆందోళనలు చేస్తున్నా పట్టింపు లేనట్టు వ్యవహరిస్తుంది వైసీపీ సర్కార్ . ఇక ఈ నేపధ్యంలోనే జగన్ తీరుపై నిప్పులు చెరుగుతున్న ఎంపీ కేశినేని నానీ జగన్ పై, వైసీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను అనిశ్చితి లో పడేసిన జగన్ @ysjagan & గ్యాంగ్@YSRCParty కి ప్రత్యేకమైన క్రిస్టమస్ శుభాకాంక్షలు రాష్ట్రం ఏమి అయినా పర్వాలేదు మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని క్రిస్టమస్ సందర్భంగా భగవంతుడిని కోరుకోండి
— Kesineni Nani (@kesineni_nani) December 25, 2019
ఇక నిన్నటికి నిన్న కేశినేని నాని తన ట్వీట్లో 'జగనన్న నువ్వు సూపర్ అన్న. కేసుల మాఫీ కోసం నీ ఎంపీలతో పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేపిస్తావు. ముస్లింల ఓట్ల కోసం ఎన్నార్సీకి వ్యతిరేకం అంటావు. ఏదయినా నీకే చెల్లిందన్న.. హ్యాట్సాఫ్ అన్నా'అంటూ సెటైర్లు వేశారు . నేడు మీరు మాత్రం సంతోషంగా ఉండాలని భగవంతుడ్ని కోరుకోండి అంటూ ఎద్దేవా చేశారు .
ఇక నేడు క్రిస్మస్ పర్వ దినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేశినేని నాని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని, మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ మీకు,మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.