వైసీపీ నూతన ఇసుక విధానం ఆర్భాటమే ... ఏం ఒరిగింది లేదన్న జనసేన నేత నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై ప్రతిపక్ష పార్టీలు పోరుబాట సాగిస్తున్నాయి. నేడు చంద్రబాబు నాయుడు విజయవాడలోని ధర్నా చౌక్ లో ఇసుక దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆయనకు సంఘీభావం తెలుపుతున్న నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన పై విరుచుకుపడుతున్నారు.
ఏపీలో ఇసుక రాజకీయం ... చంద్రబాబు ఇసుక దీక్ష వర్సెస్ ఇసుక వారోత్సవాలు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇసుక దీక్ష నేపథ్యంలో ఆయనకు సంఘీభావం ప్రకటించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా ఎదురవుతున్న పరిణామాలు ఒకలా ఉంటే, వైసీపీ ప్రభుత్వం తీరు మాత్రం మరోలా ఉందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఇసుక కోసం ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేస్తుంటే, మాటకు మాట సమాధానం చెప్పడం మినహాయించి, సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక నూతన పాలసీ అంతా ఆరాటమే తప్ప పేదలకు ఏ విధంగానూ ఉపయోగపడేలా లేదని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకుని ఇసుక సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. అంతేకాకుండా ఇసుక కొరత వల్ల పనులు లేక ఆత్మహత్యలకు పాల్పడిన కార్మికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
పనులు లేక వస్తున్న కార్మికులకు నెలకు పదివేల రూపాయలు చొప్పున మృతి అందించాలని ఆయన కోరారు. ఇక తాజాగా ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడం కోసం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతించారు. అక్రమ రవాణాకు పాల్పడితే నిందితులకు జైలు శిక్ష, జరిమానా విధించడం మంచి నిర్ణయం అన్న జననేత నేత నాదెండ్ల మనోహర్ ఏపీ ప్రభుత్వం దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించారు.