కులధ్రువీకరణ పత్రం అడిగితే కుళ్లబొడిచాడు.. పౌరునిపై రెవెన్యూ ఉద్యోగి ప్రతాపం...
అవసరం ఉందని క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే.. రోజులు తిప్పాడు. రేపు, మాపు అని కబుర్లు చెప్పాడు. వారం రోజులైనా ఇవ్వకపోగా.. ధ్రువపత్రం ఏదీ అని అడిగితే రెచ్చిపోయాడు. పౌరుడు అని కూడా చూడకుండా ప్రవర్తించాడు. ముష్టి ఘాతానికి దిగాడు. కృష్ణా జిల్లా నూజివీడు తహశీల్దార్ కార్యాలయంలో పవన్ కుమార్ అనే కంప్యూటర్ ఆపరేటర్ రెచ్చిపోయాడు.
సర్టిఫికెట్ అడిగితే..
నూజివీడు మండలం ముసునూరుకు చెందిన మద్దాల బాబురావుకు కులధ్రువీకరణ పత్రం అవసరమొచ్చింది. వారం రోజుల కింద నూజివీడు తహశీల్దార్ కార్యాలయంలో ఆప్లై చేశాడు. వాస్తవానికి ఒకటి, రెండురోజుల్లో సర్టిఫికెట్ ఇవ్వాలి.. కానీ కంప్యూటర్ ఆపరేటర్ చాలారోజుల నుంచి తిప్పుతున్నాడు. దీంతో పౌరుడు బాబురావు విసిగిపోయాడు.
దాడి..
బుధవారం తన సర్టిపికెట్ ఇస్తారా లేరా అని ప్రశ్నించారు. దీనిపై కంప్యూటర్ ఆపరేటర్ పవన్, బాబురావు మధ్య మాటా మాటా పెరిగింది. ఇంకేముంది తీవ్ర ఆగ్రహానికి గురైన పవన్.. తన చాంబర్ నుంచి బయటకొచ్చాడు. బాబురావుపై భౌతికదాడికి తెగబడ్డాడు. అక్కడున్న వారు ఆపిన దాడిచేసేందుకు ముందుకొచ్చి తన పైత్యాన్ని ప్రదర్శించాడు. పవన్ దాడికి సంబంధించి అక్కడున్న వారు వీడియో తీశారు. అది కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
గాయం
పవన్ దాడిలో బాబురావు గాయపడ్డారు. రక్తం కూడా వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. కంప్యూటర్ ఆపరేట్ ప్రవర్తనపై బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ ఇవ్వమని అడిగితే దాడి చేయడం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. తనను అన్యాయంగా దాడి చేశాడని కేసు పెడతానని చెప్తున్నారు. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు.
సరికాదు
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని అబ్దుల్లాపూర్మెట్లో విజయారెడ్డి అనే తహశీల్దార్ను సురేశ్ ముదిరాజ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. తన భూమి పట్టా కోసం రైతు తిరగబడితే.. నూజివీడులో సర్టిఫికెట్ అడిగితే కంప్యూటర్ ఆపరేటర్ చేయిచేసుకున్నాడు. పవన్ కుమార్ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.