విజయవాడలో నాటు వైద్యం వికటించి ఒక బాలుడు మృతి .. మరో ముగ్గురు సీరియస్
శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లోనూ, వైద్య రంగంలోనూ అన్ని విధాలుగా ముందడుగు వేసిన నేటి రోజుల్లోనూ ఇంకా నాటువైద్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉంది. ఇప్పటికీ చాలామంది తమ ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవడం కోసం నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. శాస్త్రీయంగా ఏవిధంగానూ నిరూపితం కాని చెట్ల మందులను వాడడం ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు తెస్తుంది.
వైద్యం కోసం వస్తే : రోగిపై డాక్టర్ అత్యాచారం.. నాలుగేళ్లుగా అదే పని..!
ఇక అసలు విషయానికొస్తే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయవాడ నగరంలో నాటు వైద్యం పేరుతో దారుణం జరిగింది. బుద్ధి మాంద్యానికి చికిత్స చేస్తానంటూ ఓ నాటు వైద్యుడు ఇచ్చిన ప్రకటనలు చూసి వైద్యం కోసం వచ్చారు చాలామంది. అయితే సదరు నాటు వైద్యుడు చేసిన వైద్యం వికటించి బాలుడు మృతి చెందాడు. గవర్నర్ పేటలో బుద్ధి మాంద్యానికి చికిత్స చేస్తానంటూ నాటు వైద్యుడు భూమేశ్వరరావు ఇచ్చిన ప్రకటనలు చూసి గంగోత్రి లాడ్జిలో ఉన్న ఆయన వద్దకు చాలామంది వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు.
గంగోత్రి లాడ్జిలో 3 గదులు అద్దెకుతీసుకుని 4 రోజులుగా చికిత్సలు చేస్తున్నాడు భూమేశ్వర్ రావు. బెంగళూరు, బళ్లారి, కడప , తెలంగాణ,నుంచి వైద్యం చేయించుకునేందుకు 11 మంది రోగులు వచ్చారు. వారికి వైద్యం చేసాడు సదరు నాటు వైద్యుడు. వైద్యం వికటించి ఒక బాలుడు మృతి చెందగా మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. వారిని విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. ఇక ఆ శాస్త్రీయమైన వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన,ఒక బాలుడి మరణానికి కారణమైన నాటు వైద్యుడు భూమేశ్వరరావును అదుపులో తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా , శాస్త్రీయత లేని వైద్యుల వద్దకు వెళ్ళటం మాత్రం ప్రజలు మానుకోవటం లేదు. ఫలితంగా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.