కేశినేని నాని ధిక్కార స్వరం: కేంద్ర బిల్లుకు వ్యతిరేకంగా ఓటింగ్: బాబుకు సవాల్ గా..!
లోక్ సభలో టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వారు ఒక మాట మీద కొనసాగటం లేదు. తాజాగా లోక్ సభలో కేంద్రం పౌరసత్వ సవరణ బిల్లు ప్రతిపాదించింది. ఈ బిల్లుకు టీడీపీ మద్దతు ప్రకటించింది. పార్టీ అధినేత నుండి బిల్లుకు మద్దతు ఇవ్వాలని సూచనలు అందాయి. అయితే పార్టీ పరంగా విప్ మాత్రం జారీ చేయలేదు. అయితే, అర్ద్రరాత్రి జరిగిన ఓటింగ్ లో ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు సభ్యులు పార్టీ నిర్ణయం మేరకు బిల్లుకు అనుకూలంగా ఓటు వేసారు. అయితే , మరో సభ్యుడు మాత్రం అనుకూలంగా ఓటు వేయలేదు. ఇప్పుడు ఇది టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. అయినా..చంద్రబాబు ఆ ఎంపీ మీద చర్యలు తీసుకుంటారా అంటే ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని చెబుతున్నారు. అసలు ఆ ఎంపీ ఎవరు..ఎందుకు ఆ విధంగా వ్యవహరించారనేది ఇప్పుడు తెలుగు ఎంపీల్లో ఆసక్తి కర చర్చకు కారణమైంది.
టీడీపీ ఎంపీ కేశినేని నానీకి కేంద్రంలో మరో కీలక పదవి .. రీజన్ ఇదేనా ?
ఇద్దరు అనుకూలంగా..ఒకరు వ్యతిరేకంగా..
లోక్ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ బిల్లును ప్రతిపాదించారు. ఆ బిల్లు పైన అర్ద్రరాత్రి వరకు చర్చ సాగింది. ఆ చర్చలో టీడీపీ సైతం పాల్గొంది. ఏపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ..వైసీపీ రెండు పార్టీలు బిల్లుకు మద్దతు ప్రకటించాయి. తొలుత వైసీపీలో కొంత కన్ ఫ్యూజన్ కనిపించినా..విజయ సాయిరెడ్డి నేరుగా పార్టీ అధినేతతో సంప్రదించిన తరువాత లోక్ సభలో పార్టీ ఫ్లోర్ లీడర్ కు సమాచారం ఇచ్చారు. బిల్లుకు మద్దతివ్వాలనేది పార్టీ నిర్ణయంగా చెప్పారు. ఇదే సమయంలో టీడీపీ నుండి ముగ్గురు ఎంపీలు ఓటింగ్ లో పాల్గొన్నారు. అందులో ఇద్దరు సభ్యులు జయదేవ్..రామ్మోహన నాయుడు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా.. కేశినేని నాని మాత్రం మద్దతు ఇవ్వలేదు.
ముస్లింలకు ఈ బిల్లు వ్యతిరేకం అంటూ..
పార్టీ పరంగా బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా.. పార్టీకే చెందిన ఎంపీ కేశినేని మాత్రం దీనిని వ్యతిరేకించారు. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కావటంతో తాను మద్దతు ఇవ్వటం లేదని మీడియాతో చెప్పారు. ఇదే సమయంలో టీడీపీ నుండి ముగ్గురు సభ్యులే కావటంతో..విప్ జారీ చేయలేదు. ఇప్పుడు టీడీపీలో ఉన్న ముగ్గురు సభ్యుల్లో..ఇద్దరు ఒక రకంగా..మరో సభ్యుడు మరో విధంగా వ్యవహరించటం తో ఈ వ్యవహారం ఇప్పుడు చంద్రబాబు వద్దకు చేరింది. తెలుగు ఎంపీల్లోనే కాకుండా..వివాదాస్పద బిల్లు కావటంతో మద్దతిచ్చింది ఎవరు..వ్యతిరేకించింది ఎవరు అనే లెక్కలను తేల్చే పనిలో బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు. అసలు..కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉన్న కేశినేని నాని..ఇప్పుడు పార్టీ నిర్ణయానికి భిన్నంగా కేంద్ర బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించం వెనుక అసలు కారణం ఏంటనే చర్చ ఆసక్తి కరంగా మారింది.
చంద్రబాబుకు కొత్త సమస్య..ఏం చేయబోతున్నారు
ఇప్పుడు ఏపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో రోజుకో పేరు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మరో వైపు ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరటం పైన..చంద్రబాబు సూచనల మేరకే వారు బీజేపీలో చేరారనే ప్రచారం సాగుతోంది. ఇక, పార్టీ నుండి ముగ్గురు ఎంపీలు ఉండగా..అందులో కేశినేని పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించటం పైన చంద్రబాబు ఆరా తీసినట్లు సమాచారం. అయితే, కేశినేని నాని 2019 ఎన్నికలు ముగిసిన నాటి నుండి పార్టీలోనే ఉంటున్నా..జరుగుతున్న పరిణామాల మీద అసహనంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. లోక్ సభ లో పార్టీ ఫ్లోర్ లీడర్ గా జయదేవ్ కు ఇచ్చిన సమయం నుండి కేశినేని నాని అసహనంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు చంద్రబాబు సైతం తమ మాట ధిక్కరించి జాతీయ స్థాయిలో చర్చకు కారణమైన సొంత పార్టీ ఎంపీ మీద చర్యలు తీసుకొనే పరిస్థితుల్లో లేరు. మరి..ఇప్పుడు ఈ విషయం మీద చంద్రబాబు ఎలా సమర్ధించుకుంటారు..ఏం చెబుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.