విధ్వంసానికే జగన్ రెడ్డి జై.. ప్రజావేదిక కూల్చివేతకు ఏడాది .. టీడీపీ విమర్శనాస్త్రాలు
ఏపీలో ప్రజావేదిక కూల్చివేతకు గురై నేటికి ఏడాది కావడంతో ప్రజా వేదిక కూల్చివేతపై టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. నేడు ప్రజావేదిక ప్రాంతాన్ని సందర్శించాలని ప్రయత్నం చేసిన టిడిపి నేతలను ఉండవల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా వేదిక సందర్శనకు వెళుతున్న టిడిపి నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు టీడీపీ నేతలను ప్రజావేదిక వద్దకు వెళ్లకుండా, కోవిడ్ నిబంధనలను సాకుగా చూపి అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఉండవల్లిలో ఉద్రిక్తత .. ప్రజావేదిక ప్రాంతానికి వెళ్లేందుకు టీడీపీ నేతల యత్నం .. అరెస్ట్
జగన్ పాలనకు ప్రజావేదిక శిథిలాలే సాక్ష్యం
నాడు ప్రజావేదికను కూల్చివేసి వైసిపి అరాచక పాలన మొదలు పెట్టిందని టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావేదికను కడితే ఒక్క రాత్రిలో కూల్చేశారు జగన్ రెడ్డి అంటూ నారా లోకేష్ మండిపడ్డారు. చంద్రబాబు అంటే నవ్యాంధ్ర నిర్మాత, జగన్ రెడ్డి అంటే నవ్యాంధ్ర నాశనానికి కంకణం కట్టుకున్న అరాచక పాలకుడని ప్రజావేదిక శిథిలాలు సాక్ష్యం చెబుతున్నాయి అంటూ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి పునాది వేశారు
ఇటువంటి వారిని పాలకుడిగా ఎన్నుకున్న పాపానికి ప్రజల సమస్యల పరిష్కార వేదిక అయిన ప్రజా వేదికను కూలగొట్టి ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి పునాది వేసి అభివృద్దికి సమాధి కట్టి ఏడాది అవుతోంది అంటూ లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక భవనం కట్టడం ఎంతో కష్టం.. కట్టడం ఉపయోగం కూడా.. కూలగొట్టడం చిటికెలో పని ,తీవ్ర నష్టం.. తెలిసి కూడా విధ్వంసానికి జై కొడుతున్నారు వైయస్ జగన్ అంటూ నారా లోకేష్ ప్రజావేదిక కూల్చివేతకు ఏడాది అంటూ ఏపీలో విధ్వంసకర పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం
టిడిపి నేతల అక్రమ అరెస్టులపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ప్రజావేదిక సందర్శనకు వెళుతున్న టిడిపి నేతలను అరెస్టు చేసిన క్రమంలో స్పందించిన ఉమా వైసిపి ప్రభుత్వ ఏడాది విధ్వంస పాలనకు సాక్ష్యంగా నేటికి ప్రజావేదిక శిథిలాలను అదేవిధంగా ఉంచారు .అన్ని వ్యవస్థలను కుప్ప కూల్చారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ అక్రమ కేసులు,అరెస్టులు సాగిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షం అంటే ఎందుకు భయం చెప్పండి సీఎం జగన్ అని ప్రశ్నించారు దేవినేని ఉమా.
జగన్ పాలన శుభకార్యంతో కాదు ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి విధ్వంసానికి ఏడాది అంటూ టిడిపి సీనియర్ నేత కళా వెంకట్రావు ఫైర్ అయ్యారు. ప్రజా వేదిక కూల్చివేతతో తొమ్మిది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మట్టిపాలు చేశారని ఆయన పేర్కొన్నారు. వైయస్ జగన్ పాలన శుభకార్యంతో ప్రారంభం కాకుండా ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభం అయిందని ఆయన విమర్శించారు. ప్రజావేదిక సందర్శనకు వెళుతున్న టిడిపి నేతలను అరెస్ట్ చేయడం దారుణమని ఆయన ప్రభుత్వ తీరును ఖండించారు. కూల్చివేతలు, విధ్వంసాలు, అక్రమ కేసులు, అరెస్టులు, వేధింపులు తప్ప వైసిపి పాలనలో అభివృద్ధి ఏదీ లేదని కళా వెంకట్రావు అభిప్రాయపడ్డారు. ఇక నేడు ప్రజా వేదిక కూల్చివేత ఏడాది అయిన సందర్భంగా ఏడాదికాలంగా వైసిపి అరాచకాలు కొనసాగుతున్నాయి అంటూ విరుచుకుపడుతున్నారు టిడిపి నేతలు.