అమరావతి రైతులకు మంచి ప్యాకేజీ: జగన్ అన్యాయం చేయరంటూ మంత్రి పెద్దిరెడ్డి
అమరావతి: రాజధాని రైతులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అన్యాయం చేయరని, వారికి మంచి ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. సచివాలయంలో ఆయన సోమవారం మాట్లాడారు.
భూములు లాక్కుని వెళ్లడం లేదు..
రాజధాని కోసం ల్యాండ్పూలింగ్ విధానంలో గత ప్రభుత్వం భూములు సేకరించిందని, మళ్లీ అదే విధానంలో వారికి భూములు ఇవ్వొచ్చని అన్నారు. రాజధాని అమరావతి రైతుల భూములను ఎవరూ లాక్కుని వెళ్లడం లేదని, కౌలు నిధులతో మళ్లీ సాగుకు అనుకూలంగా చేసి వారికి ఇవ్వొచ్చని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.
చంద్రబాబు మోసం చేశారు..
అంతేగాక, ఇతర ప్రాంతాలవారికి అభివృద్ధి అక్కర్లేదా? అని ప్రశ్నించారు మంత్రి పెద్ది రెడ్డి. మూడు రాజధానులతో రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. విభజన చట్టం మేరకు హైదరాబాద్లో ఉండేందుకు పదేళ్లు సమయం ఉన్నా.. అమరావతి వచ్చి అభివృద్ధి చేస్తామంటూ చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. అమరావతి ప్రాంతంతో వ్యాపారం చేశారని పెద్దిరెడ్డి ఆరోపించారు. అవసరమైన మేరకు భూమి తీసుకుని అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.
బోస్టన్ నివేదిక తర్వాతే నిర్ణయం..
జనవరి 3న బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ నివేదిక వస్తుందని, ఆ తర్వాతే రాజధానిపై ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని చెప్పారు. అమరావతితోపాటు కర్నూలు, విశాఖపట్నం రాజధానులుగా ఉంటే బాగుంటుంది కదా అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అమరావతి అసెంబ్లీ, విశాఖపట్నంలో సచివాలయం, కర్నూలులో హైకోర్టు ఉండాలనే ప్రతిపాదనలు చేశారు. అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచీలను ఏర్పాటు చేయాలి జీఎన్ రావు కమిటీ కూడా తెలిపింది.
ఆ రైతులకు బెయిల్..
ఇది ఇలావుండగా, మీడియా ప్రతినిధులపై దాడి కేసులో అరెస్టైన రాజధాని రైతులకు బెయిల్ మంజూరైంది. ఆరుగురు రైతులకు మంగళగిరి అదనపు జూనియర్ సివిల్ జడ్జీ వీవీఎస్వీ లక్ష్మి బెయిల్ మంజూరు చేశారు. రాజధాని కోసం జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా కొంతమంది మీడియా ప్రతినిధులపై ఇటీవల దాడి జరిగింది. ఈ క్రమంలో ఆరుగురు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలని, ఎక్కడికి తరలించవద్దని డిమాండ్ చేస్తూ రైతులు గత కొద్ది రోజులుగా భారీగా నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే.