వైసీపీ భవనాలకు పార్టీ రంగులు వేసుకోటానికే ... పాలించటానికి పనికిరాదన్న కన్నా
ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏ చిన్న అవకాశం దొరికిన్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడుతున్నారు . గత ప్రభుత్వం టీడీపీ హయాంలో నష్టపోయిన ప్రజలకు ఇప్పుడు వైసీపీతో కూడా నష్టం జరుగుతుందని ఆయన టీడీపీని, వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఇసుక కొరత తీరలేదని , భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైందని కన్నా లక్ష్మీ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు.
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసేందుకే పనికొస్తుందని ఘాటుగా విమర్శించారు. భవనాలకు పార్టీ రంగులు వేసుకోవాడానికి తప్ప, రాష్ట్రాన్ని పాలించడానికి వైసీపీ పనికిరాదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కార్మికులు ఇసుక కొరతతో పనుల్లేక పస్తులుండి చస్తున్నా అధికార పార్టీ నేతలకు పట్టటం లేదన్నారు. ప్రభుత్వ వైఖరి హేయమన్నారు.ప్రజలు వైసీపీకి 151 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇసుక కృత్రిమ కొరతను సృష్టించారని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ అసమర్ధ పాలనతో భవన నిర్మాణ కార్మికులకు రూ. 150 కూలీ కూడా దొరకని పరిస్థితిని తీసుకొచ్చారని కన్నా లక్ష్మీనారాయణ మండిపాటుకు గురయ్యారు . ఇంతటి అసమర్థ ప్రభుత్వాన్ని తాను ఇంతవరకు చూడలేదని కన్నా ట్వీట్ చేశారు. దీంతోపాటు, వివిధ కట్టడాలపై వైసీపీ రంగులు వేసిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా కన్నా లక్ష్మీనారాయణ షేర్ చేశారు. వీటిలో గ్రామ సచివాలయం, శ్మశానం, ఓవర్ హెడ్ ట్యాంకులు మాత్రమే కాదు చేతి పంపులు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ వైసీపీ పార్టీ రంగులు వేసి ఉన్నాయి. ఆర్భాటం చేయడానికి తప్ప వైసీపీ పాలించడానికి పనికిరాదని కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఏం సమాధానం చెప్తుందో మరి.