ఏంటీ అరాచకం.. ఇంత హింసా.. అలాంటి ఒక్క అధికారి ఉన్నా పరిస్థితి మరోలా ఉండేది : పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ,జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంత హింస మునుపెన్నడూ చూడలేదన్నారు. బెదిరింపులతో అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అన్ని స్థానాలను ఏకగ్రీవం చేసే ఉద్దేశం ఉంటే.. ఆ మాత్రం దానికి ఎన్నికలు ఎందుకు అని ప్రశ్నించారు.
ఏపీ అంటేనే హింస అనే పరిస్థితి..
ఏపీ అంటేనే హింస అని పరిస్థితి తీసుకొస్తున్నారని.. రాష్ట్రాన్ని మరో బీహార్లా మార్చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రధాన ఉద్దేశం గ్రామ స్వరాజ్యం అన్నారు. ప్రతీ గ్రామానికి అభివృద్ది వికేంద్రీకరణ జరగాలన్న ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పారు. కానీ గతంలో టీడీపీ అసలు స్థానిక సంస్థల ఎన్నికలే నిర్వహించలేదని.. ఇప్పుడు వైసీపీ ఎన్నికలను ఏకపక్షం చేసేందుకు దౌర్జన్యానికి పాల్పడుతోందని ఆరోపించారు. వైసీపీకి ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఏమాత్రం గౌరవం లేదు కాబట్టే ఇలా వ్యవహరిస్తోందన్నారు. రాజకీయాలను నేరమయం చేయడాన్ని తాము తీవ్రంగా నిరసిస్తామని చెప్పారు.
అలాంటి ఒక్క అధికారి ఉన్నా..
శేషన్ లాంటి ఎన్నికల అధికారి రాష్ట్రంలో ఉండి ఉంటే ఇంత హింస చెలరేగకపోయి ఉండేదన్నారు. పోలీసులు,ఎన్నికల అధికారులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.చిత్తూరులో అసలు ఎక్కడా నామినేషన్లు వేయనివ్వని పరిస్థితి నెలకొందన్నారు. నెల్లూరులో మహిళలపై దాడులు చేశారని.. అనంతపురంలో తమ పార్టీకి చెందిన నేత చిలకా మధుసూధన్ రెడ్డిపై దాడి చేశారన్నారు.
బెదిరింపులతో వైసీపీ ఏకగ్రీవ స్థానాలను గెలుచుకోవచ్చేమో గానీ ప్రజల మనసులు గెలుచుకోలేదన్నారు. నామినేషన్లు వేసినవారెవరూ బెదిరిపోవద్దని.. ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేయాలని అన్నారు. దెబ్బలు తిన్నా సరే బలంగా నిలబడాలని.. అలా అయితేనే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోగలమని స్పష్టం చేశారు.
వైసీపీపై కన్నా ఫైర్
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కూడా వైసీపీపై ఫైర్ అయ్యారు. 1973 నుంచి ఇప్పటివరకు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఇంత హింస చెలరేగిన ఎన్నికలను ఏనాడు చూడలేదన్నారు. వైసీపీ తాలుకు రౌడీయిజానికి ముకుతాడు వేయాల్సిన అవసరం ఉందన్నారు.
నామినేషన్లు వేసేందుకే ఇంత హింస జరిగితే.. ఇక ఓటు వేసేందుకు ప్రజలు ఎలా వస్తారని ప్రశ్నించారు. అన్నీ ఏకగ్రీవమే చేసుకోవాలనుకుంటే.. ఇక ఎన్నికలు ఎందుకు.. ఈసీ ఎందుకు అని నిలదీశారు. నియంత్రుత్వానికి తోడు ఫ్యాక్షనిజం తోడైందని.. ఎక్కడ చూసినా వైసీపీ కార్యకర్తలు ఇతర అభ్యర్థుల నామినేషన్ ఫారాలను లాక్కుని,చింపివేస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ గూండాయిజానికి బ్రేక్ వేయాలంటే.. తమ అభ్యర్థులను గెలిపించాలన్న కన్నా..
నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తే.. అధికారులే పాత ఓటరు లిస్టులో మీ పేరు అలా ఉంది.. కొత్త ఓటరు లిస్టులో ఇలా ఉందని.. తిరకాసు మాటలతో నామినేషన్లను తిరస్కరిస్తున్నారని కన్నా ఆరోపించారు. నామినేషన్ వేయడానికి వెళ్లిన అభ్యర్థులపై దుర్గి ఎస్ఐ దుర్భాషలాడారని,బూతులు తిట్టారని ఆరోపించారు.
కాళహస్తిలో తమ అభ్యర్థులపై దాడి జరిగిందని ఎస్పీకి ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇంతటి అరాచకత్వాన్ని తాము ఎన్నడూ చూడలేదని.. ప్రజలు ఇకనైనా ఈ నియంత్రుత్వాన్ని గమనించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైసీపీ గుండాయిజానికి బ్రేక్ వేయాలంటే జనసేన,బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.