జనసేనాని డెడ్ లైన్ ముగిసింది: ప్రభుత్వ భారీ ప్రకటనల వెనుక: తాజాగా...జగన్..పవన్ పిలుపు ఏంటంటే..!
ఏపీలో ఇసుక పేరుతో సాగిన రాజకీయ దుమారం తగ్గముఖం పట్టినట్టేనా. జనసేనాని ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది. సరిగ్గా ఇదే సమయానికి ఇదే ఇసుక అంశం మీద ప్రభుత్వ పెద్ద ఎత్తున పత్రికా ప్రకటనలు ఇచ్చింది. అయితే, పవన్ నాడు కోరింది ఆత్మహత్య చేసుకున్న కార్మికులకు పరిహారం చెల్లించాలని..రెండు వారాల్లోగా చెల్లించకపోతే అమరావతితో నడుస్తానని హెచ్చరించారు. పోలీసులను దించుతారో.. మిలిట్రీని దించుతారో మీ ఇష్టం అంటూ హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ సైతం దీక్షలు చేసారు. ఇప్పుడు ప్రభుత్వం రెండు లక్షల టన్నుల ఇసక సరఫరాకు సిద్దంగా ఉందని ప్రకటనల్లో స్పష్టం చేసారు. అయితే, పవన్ మాత్రం సీఎం జగన్ రియలైజ్ అయ్యారంటూ ట్వీట్ చేసారు. ఇసుక అక్రమ రవాణా పైన ఫిర్యాదులకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ కేటాయింది. అదే సమయంలో పవన్ సైతం జనసైనికులు ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరిగితే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మరి..ఇప్పుడు పవన్ డిమాండ్ పూర్తిగా నెరవేరలేదు..అమరావతిలో నడుస్తారా..
జగన్ పగ తీర్చుకుంటున్నారు: చంద్రబాబు ముద్ర లేకుండా: పవన్..నాగబాబు ఆగ్రహం..!
ముగిసిన పవన్ డెడ్ లైన్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 3వ తేదీన విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. అందులో ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. రెండు వారాల్లోగా ఇసుక సమస్య పరిష్కరించటంతో పాటుగా ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు. అదే విధంగా పని కోల్పోయిన ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి పది వేలు చొప్పున భవన నిర్మాణ సంక్షేమ నిధి నుండి చెల్లించాలని సూచించారు. ప్రభుత్వం రెండు వారాల్లో ఈ డిమాండ్లు అమలు చేయకపోతే తాను అమరావతిలో నడుస్తానని హెచ్చరించారు. అప్పుడు ఎవరూ తనను ఆపలేరంటూ వ్యాఖ్యానించారు. పోలీసులు..మిలిట్రీ ఎవరినైనా దించుకోండంటూ హెచ్చరించారు. రెండు వారాలు ముగిసిన తరువాత జనసైనికులు టెంట్లు వేసి నిరసన దీక్షలకు కూర్చోవాలని పిలుపునిచ్చారు. ఆ రెండు వారాలు ముగిసింది. కానీ, ప్రభుత్వం మాత్రం ఇసుక లభ్యత మొదలైంది కానీ, పవన్ డిమాండ్ మేరకు పరిహారం చెల్లింపు పైన స్పందించలేదు.
ప్రభుత్వం భారీగా ప్రకటనల వెనుక..
ఇసుక సమస్య రాజకీయ అంశంగా మారింది. దీని పైన అధికార పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు..పవన్ కళ్యాణ్..బీజేపి నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. అక్రమంగా ఇసుక అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలు చేసారు. ఇప్పుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున పత్రికా ప్రకటనలు ఇచ్చింది. ప్రతీ రోజు సుమారు రెండు లక్షల టన్నుల ఇసుక సరఫరా అవుతుందని ప్రకటించింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్టాక్ పాయింట్లను ప్రకటించింది. అయితే, ప్రభుత్వం నదుల్లో వరదల కారణంగా ఇసుక లభించటం లేదని చెబుతూ వచ్చింది. అయితే, దీనిని ప్రతిపక్షాల తమ పోరాట ఫలితంగా చెప్పుకుంటున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ రియలైజ్ అయ్యారంటూ పవన్ ట్వీట్ చేసారు. అయితే, ప్రభుత్వం మాత్రం తాము గతం నుండి చెబుతున్నట్లుగా వరదలు తగ్గినాక ఇసుక అందుబాటులోకి వస్తుందనే వాదనకు మద్దతుగా..ప్రతిపక్షాలకు సైతం సమాధానం చెప్పే విధంగా ఇంత భారీ స్థాయిలో ప్రకటనలు ఇచ్చినట్లుగా స్పష్టం అవుతోంది.
ఇప్పుడు సీఎం జగన్..పవన్ ఇద్దరూ ఒకటే పిలుపు..
ఇసుక కొరత తీరినా..పవన్ తాను చేసిన డిమాండ్లలో కీలకమైన భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వారికి పరిహారం..అదే విధంగా పనులు కోల్పోయిన కార్మికులకు పది వేలు చొప్పున ఆర్దిక సాయం పైన ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. మరి..వీటి మీద ఇప్పుడు పవన్ తాను ప్రకటించిన విధంగా పోరాటానికి దిగుతారా లేదా అనేది ఆసక్తి కరంగా మారింది. ఇక, ఇసుక పూర్తిగా అందు బాటులోకి రావటంతో అక్రమ రవాణా..నిల్వల పైన కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసారు. అందులో పని చేసే సిబ్బందికి సూచనలు చేసారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాలని పోలీసు ..మైనింగ్ శాఖను ఆదేశించారు. ఇదే సమయంలో పవన్ సైతం ఇసుక అక్రమ రవాణా జరగకుండా జనసైనికులు అడ్డుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. దీని ద్వారా..ఏపీలో రాజకీయ దుమారం రేపిన ఇసుక సమస్యకు తెర పడినట్లుగా కనిపిస్తోంది.