పవన్ కల్యాణ్ స్వరం మారింది, చంద్రబాబు కన్నా బాధ ఎక్కువే, 3 రాజధానులపై : మంత్రులు కన్నబాబు, నాని
గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే పనిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని మంత్రులు కన్నబాబు, పేర్ని నాని తెలిపారు. రాజధానిపై కమిటీ నివేదిక ఇలా ఉండొచ్చని సీఎం జగన్ చెప్పారే తప్పా, ఇదే ఫైనల్ అని చెప్పలేదని పేర్కొన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రం సమానంగా అభివృద్ధి చెందుతుదని మంత్రి కన్నబాబు చెప్పారు. ప్రతిపక్ష టీడీపీ ఎందుకు ఆందోళనకు గురవుతుందో అర్థం కావడం లేదన్నారు.
వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి
రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారని మంత్రి కన్నబాబు తెలిపారు. హైకోర్టు ఒక చోట రాజధాని మరో చోట ఉంటే తప్పేంటి అని ప్రశ్నించారు. అలా చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా అని గుర్తుచేశారు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో అయితే అహ్మదాబాద్లో కోర్టు ఉంది అని కన్నబాబు పేర్కొన్నారు.
మారిన పవన్ స్వరం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనలు స్థిరంగా ఉండవని మంత్రి కన్నబాబు విమర్శించారు. టీడీపీకి డూప్లికేట్ జనసేన అని విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో చడీ చప్పుడు చేయని పవన్ కల్యాణ్, వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే స్వరం మారిందని గుర్తుచేశారు. టీడీపీ ప్రతిపక్ష స్థానంలోకి రాగానే.. చంద్రబాబు కన్నా పవన్ కల్యాణ్ ఎక్కువ మాట్లాడుతున్నారని చెప్పారు.
ఫైనల్ కాదు.. కదా...
ఒకచోట సచివాలయం, మరో చోట హైకోర్టు ఉంటే తప్పేంటి అని మరో మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. మూడు రాజధానుల అంశాన్ని సీఎం జగన్ సూచనప్రాయంగా చెప్పారని తెలిపారు. కమిటీ నివేదిక అలా ఉండొచ్చని చెప్పారే తప్పా.. మూడు రాజధానులు ఏర్పడబోతున్నాయని చెప్పలేదన్నారు. సీఎం జగన్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని గోరంత కొండంతలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ధైర్యంగా చెప్పే సత్తా జగన్కు ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యవాదిగా అందరి అభిప్రాయం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు డిసిషన్ ఉంటుందని తెలిపారు.
మిగతా ప్రాంతాల సంగతి..?
అంతా నా జిల్లాలో ఉండాలనే భావన సరికాదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం అమరావతిలోనే సచివాలయం, హైకోర్టు, పరిపాలన ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఒకే ప్రాంతం కాకుండా మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం పాటుపడటం మంచిదని అభిప్రాయపడ్డారు. రాజధాని విశాఖపట్టణంలో అయితే బాగుంటుందని గంటా శ్రీనివాసరావు, కర్నూలులో బాగుంటుందని కేఈ కృష్ణమూర్తి పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. కానీ యనమల రామకృష్ణుడు, నారాయణ మాత్రం అమరావతిలో అయితేనే బాగుంటుందని తనదైన శైలిలో విమర్శించారు.