సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ లేఖ .. వారి బాధలు చూసే ఈ లేఖ .. స్పందించండి
Recommended Video
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాశారు. ఇక ఈ లేఖలోప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇచ్చి, ఆ తర్వాత సమస్యలపై స్పందిస్తామని ప్రకటించిన తాము ప్రజల కష్టాలను చూడలేక ఈ లేఖ రాస్తున్నట్లు గా పేర్కొన్నారు. జనసేన పార్టీ దృష్టికి అనేక విజ్ఞప్తులు వచ్చినప్పటికీ కొత్త ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలని సంయమనం పాటించామని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టటం వెనుక బలమైన కారణం ఉంది ... అదేంటో తెలుసా ?
భవన నిర్మాణ కార్మికులు పనిలేక పస్తులుంటున్నారన్న పవన్ .. ఆదుకోవాలని విజ్ఞప్తి
వైసీపీ ప్రభుత్వానికి పాలన విషయంలో డెడ్ లైన్ 100 రోజుల సమయం ఇస్తామన్న ప్రకటన చేసిన జనసేన పార్టీ అధ్యక్షుడు కొన్ని గంటల్లోనే మనసు మార్చుకున్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ రంగం కుదేలవుతోందని, భవన నిర్మాణ కార్మికులు పొట్టకూటి కోసం నానా బాధలు పడుతున్నారని ఆయన తెలియజేశారు. భవన నిర్మాణ కార్మికుల బాధలు చూసిన తర్వాత సంయమనం పాటించలేకపోతున్నామని, అందుకే లేఖ రాస్తున్నానని వెల్లడించారు పవన్ కళ్యాణ్. ఇక ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశిస్తూ ఆయన రాసిన లేఖలో రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల నిర్మాణాలు కుంటుపడ్డాయని, భవన నిర్మాణ కార్మికులు పనిలేక పస్తులుంటున్నారని, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారని పవన్ తన లేఖలో పేర్కొన్నారు.
కొత్త ఇసుక విధానం ప్రకటించటానికి సెప్టెంబరు 5 వరకు ఆగాల్సిన అవసరం ఏంటన్న పవన్
రాష్ట్రంలో నూతన ఇసుక విధానం ప్రకటించడానికి ప్రభుత్వం సెప్టెంబరు 5 వరకు ఆగాల్సిన అవసరం ఏంటని పవన్ తన లేఖలో ప్రశ్నించారు. అప్పటివరకు కూలి పనులు చేసుకునేవాళ్లు, దినసరి వేతనంతో పొట్ట గడుపుకునే వాళ్ళు ఏమైపోవాలంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి కష్టకాలంలో భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకలి బాధలు ప్రభుత్వానికి ఏమంత మంచిది కాదని చెప్పారు పవన్ కళ్యాణ్. మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంలో తనవద్దకు వచ్చిన కొందరు భవన నిర్మాణ కార్మికులు తమ బాధలు వ్యక్తపరిచి కన్నీటిపర్యంతమయ్యారని వెల్లడించారు.
భవన నిర్మాణ కార్మికులకు జనసేన అండగా ఉంటుందన్న పవన్ .. తక్షణం ఆదుకోవాలని జగన్ కు లేఖ
అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక మైనింగ్ అవకతవకలపై తాను అనేక సందర్భాలలో మాట్లాడానని, మీరు తీసుకువచ్చే కొత్త ఇసుక మైనింగ్ పాలసీ ఎటువంటి అవకతవకలకు అవకాశం ఇచ్చేలా ఉండరాదని జనసేన పార్టీ కోరుతోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇళ్లను నిర్మించుకునే ప్రజలు, కాంట్రాక్టర్లు, కార్మికులకు అనుకూలంగా మీ ఇసుక పాలసీ ఉన్నట్లయితే, అటువంటి పాలసీకి జనసేన పార్టీ కూడా మద్దతు ఇస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు జనసేన సదా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాము అంటూ తన లేఖలో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ . ఇక వారిని తక్షణం ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ జగన్ ను కోరారు.