జగన్ టార్గెట్ గా పవన్ మరో అస్త్రం ... వృద్ధాప్య పెన్షన్ సంగతేంటి అంటూ ఆగ్రహం
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు మొదలైన నాటి నుండి సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదో ఒక అంశంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక నేడు తాజాగా వృద్ధాప్య పెన్షన్ అమలు తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో వృద్ధాప్య పెన్షన్ రూ.2 వేలు నుంచి రూ.3వేలు ఇస్తామని వైసీపీ చెప్పిందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారుల అర్హత వయసును 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం అన్నారని గుర్తు చేశారు.
కానీ అధికారంలోకి వచ్చాక వీటిలో ఏ ఒక్కదానినీ నెరవేర్చలేదు అని పవన్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలో పేర్కొన్నట్లుగా రూ. పెన్షన్ రూ.3 వేలు చేయకుండా రూ.2,250 మాత్రమే చేశారని విమర్శలు గుప్పించారు. దీని ద్వారా ఒక్కో పెన్షన్ దారుడు రూ.750 నష్టపోతున్నారని పవన్ కళ్యాణ్ లెక్క చెప్పారు. పెన్షన్ అర్హత వయసు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తామని మే 30న విడుదల చేసిన జీవో నెంబర్ 103 ద్వారా చెప్పారన్న పవన్ కళ్యాణ్ ఆ విధంగా చూసుకున్నా కొత్తగా మరో 10 లక్షల మందికి పెన్షన్ దక్కాల్సి ఉందని ఆయన లెక్కలు చెప్పారు .
కానీ ఈ రోజు వరకూ ఒక్క కొత్త పెన్షన్ లబ్ధిదారుని పేరు కూడా నమోదవలేదని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్. అలా చూసుకుంటే కొత్తవారికి ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ప్రకారం లెక్క చూసినా ఈ ఏడు నెలల కాలంలో ఒక్కొక్కరు 15700 రూపాయల చొప్పున కోల్పోయారని జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకో కుండా ప్రజలను మభ్యపెడుతున్నారని పవన్కళ్యాణ్ ఆరోపించారు.