మా ఆలోచనా అదే: ఏపీ నిర్ణయానికి వ్యతిరేకంగా..అందుకే ఆనందంగా: మోడీకి థ్యాంక్స్: పవన్ కల్యాణ్
అమరావతి: దేశవ్యాప్తంగా విద్యా విధానంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతూ కేంద్ర మంత్రివర్గం నూతన విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకుని రావడాన్ని జనసేన పార్టీ స్వాగతించింది. అయిదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన కొనసాగించాలనే నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మాతృభాషలో విద్యాబోధన కొనసాగించినప్పుడే గొప్ప ఫలితాలు ఆవిష్కృతమౌతాయనే విషయాన్ని యునెస్కో సైతం ప్రకటించిందని చెప్పారు.
ఏపీ బీజేపీకి కొత్త చీఫ్: పొత్తుపై కుండబద్దలు కొట్టిన పవన్ కల్యాణ్: రాజకీయ ప్రయాణంపై!
ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనను తప్పనిసరి చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నప్పుడు తాము తీవ్రంగా వ్యతిరేకించామని అన్నారు. ఇప్పుడు తమ ఆలోచనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుందని చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏ మీడియంలో విద్యార్థులకు పాఠాలను బోధించాలనే విషయం ఆప్షనల్గా మాత్రమే ఉండాలే తప్ప, తప్పనిసరి చేయడం సరికాదంటూ తాము ముందు నుంచీ చెబుతూ వస్తున్నామని అన్నారు.
తెలుగు భాషను పరిరక్షించుకోవడానికి, నదులను సంరక్షించుకోవడానికీ తాము మన నది- మన నుడి ఉద్యమాన్ని చేపట్టామని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. జనసేన పార్టీ ఆలోచనా విధానాలు.. నూతన విద్యా విధానాన్ని రూపొందించిన కమిటీ భావాలు.. ఒకేలా ఉండటం తనకు ఆనందాన్ని ఇస్తోందని పవన్ కల్యాణ్ చెప్పారు. తాము ఇంగ్లీష్లో విద్యాబోధనను కొనసాగించడానికి వ్యతిరేకం కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పిల్లలు ఏ మీడియంలో చదువుకోవాలనేది వారి తల్లిదండ్రుల మీద వదిలేయాలని చెబుతూ వచ్చామని అన్నారు.
Recommended Video
మన సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లాలంటే మన భాషలు, మన నదులు సజీవంగా ఉండాలని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాము మన నది-మన నుడి కార్యక్రమాన్ని చేపట్టామని పవన్ కల్యాణ్ అన్నారు. దీన్ని నిరంతర కార్యక్రమంగా కొనసాగిస్తామని చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తరువాత మన ని-మన నుడికి మరింత పదును పెడతామని ఆయన స్పష్టం చేశారు. మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన కొనసాగించాలంటూ నిర్ణయించిన కస్తూరి రంగన్ కమిటీకి, ఆ కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆమోదించిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఙతలు చెప్పారు.