సరిహద్దు గందరగోళం పై స్పందించిన మంత్రి పేర్ని నానీ .. తెలంగాణా సర్కార్ పై అసహనం
కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో ప్రబలుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ప్రకటించాయి తెలుగు రాష్ట్రాలు . అంతే కాదు రాష్ట్రాల సరిహద్దులను కూడా క్లోజ్ చేశాయి . ఇక ఈ నేపధ్యంలో సరిహద్దుల పరిస్థితి దారుణంగా తయారైంది. తెలంగాణా నుండి ఆంధ్ర ప్రదేశ్ కు ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళాల్సిన విద్యార్థులు నానా తిప్పలు పడుతున్నారు. ఎన్వోసీ ఇచ్చినా సరిహద్దుల్లో అనుమతించటం లేదు . ఇక ఈ పరిస్థితులపై ఏపీ మంత్రి పేర్ని నానీ స్పందించారు .
Recommended Video
కరోనా : స్పెయిన్లో ఎందుకింత మృత్యు ఘోష.. లాక్డౌన్కి ముందు అసలేం జరిగింది..
ఏపీ బోర్డర్ల వద్ద పరిస్థితి గందరగోళం
హైదరాబాద్ నగరంలోని పలు హాస్టళ్ళను మూసి వేస్తూ ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకోవడంతో వేలాది మంది ఏపీ విద్యార్థులు రోడ్డున పడ్డారు . వారి విఙ్ఞప్తి మేరకు వారందరికీ ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, ఎన్ఓసీలు ఇచ్చి వారు వారి స్వస్థలాలకు వెళ్ళే ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. అయితే వారందరినీ ఏపీ బోర్డర్ల వద్ద నిలిపి వేయడంతోనే సమస్య మొదలైంది. ఇక వారిని అనుమతించాలంటే 14 రోజుల పాటు క్వారంటైన్ కు వెళ్లాలని సూచిస్తున్న పరిస్థితి .
తెలంగాణా ప్రభుత్వం పై మంత్రి పేర్ని నానీ అసహనం
ఇక ఈ పరిస్థితులపై మంత్రి పేర్ని నానీ తెలంగాణా ప్రభుత్వం పై అసహనం వ్యక్తం చేశారు . తెలంగాణా సర్కార్ తొందరపడింది. అందుకే కొత్త సమస్యలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు . తెలంగాణ ప్రభుత్వం తొందరపడి ఎన్ఓసీలిచ్చి పంపడం వల్లనే వందలాది మంది ఏపీ విద్యార్థులు సరిహద్దులలో పడిగాపులు గాచే పరిస్థితి వచ్చిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దానికి తమ ప్రభుత్వాన్ని నిందించడంలో అర్థం లేదని పేర్ని నాని పేర్కొన్నారు .
తెలంగాణ ప్రభుత్వానిది తొందరపాటుతనం
విజయవాడ, గుంటూరు, ఏలూరు మార్గాలలో తెలంగాణ నుంచి వచ్చిన విద్యార్థులు, ప్రైవేటు ఎంప్లాయిస్ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంత్రి పేర్ని నాని స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం తొందరపాటుతనంతో తీసుకున్న నిర్ణయానికి ఏపీ ప్రభుత్వాన్ని నిందించడం తగదని ఆయనన్నారు. కరోనా ప్రభావం ఎక్కువ గా ఉన్న సమయంలో ఉధృతిగా వచ్చి ప్రభుత్వాన్ని నిందించడం భావ్యమా అని ప్రశ్నించారు.
సమస్య తీవ్రంగా ఉంటె థర్మల్ స్క్రీనింగ్ సరిపోతుందా అని ప్రశ్న
తెలంగాణ ప్రభుత్వ తొందరపాటు చర్యల వల్లే గరికపాడు చెక్ పోస్ట్ సమస్య వచ్చింది.. ఎన్ఓసీ వంటి దుర్మార్గపు కాగితాలు తీసుకున్నప్పుడు కరోనా వచ్చే అవకాశం ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ కాగితాలను అసరాగా చేసుకుని ఉధృతంగా వచ్చి తమ ప్రభుత్వాన్ని నిందించడం సరి కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సమస్య ఇంత తీవ్రంగా ఉంటె థర్మల్ స్క్రీన్ టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నించడం సరికాదు.
తెలంగాణలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే తాజా పరిస్థితి
బోర్డర్ వద్ద ఉన్న వారిలో ఎంత మంది విదేశీయులను కలిశారో, ఎక్కడెక్కడ తిరిగారో కరోనా లక్షణాలు ఆ క్షణంలో బయట పడేవి కావు.. కరోనా సోకిన తర్వాత 14రోజుల్లో ఏ క్షణమైనా బయటపడే అవకాశం ఉంది కాబట్టి మా జాగ్రత్త మాది అంటూ తెలంగాణ సర్కార్పై పేర్ని నాని కామెంట్ చేశారు.అయితే తెలంగాణ నుంచి వచ్చిన వారందిరీ మెడికల్ టెస్టులు నిర్వహించి, వారిని వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి చెప్పారు.తెలంగాణలో ఆంధ్ర ప్రదేశ్ తో పోలిస్తే కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల ప్రధానంగా భయపడుతున్న పరిస్థితి .