మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు కోసం: ఏపీ హైకోర్టులో పిటీషన్: అభ్యంతరం ఎందుకు?
అమరావతి: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ కార్యాలయం సమాయాత్తమౌతోన్న వేళ..దానికి సంబంధించిన ఓ పిటీషన్ ఏపీ హైకోర్టులో దాఖలైంది. మున్సిపల్ ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయాలనేది ఆ పిటీషన్ సారాంశం. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ఈ మధ్యాహ్నం 2:15 నిమిషాలకు హైకోర్టు విచారణ చేపట్టనుంది. వాదోపవాదాలను ఆలకించనుంది.
మూడు రాజధానుల దిశగా..శరవేగంగా: కీలకంగా మారిన శ్రీలక్ష్మి: అమరావతి ప్రాజెక్టుల్లో కదలిక?
రాష్ట్రవ్యాప్తంగా 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహించడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 15వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. గ్రేటర్ విశాఖ, విజయవాడ, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు కడప, కర్నూలు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 75 మున్సిపాలిటీలకు వచ్చేనెల 10వ తేదీన పోలింగ్ నిర్వహించాల్సి ఉంది.
ఇదివరకు ఈ ప్రక్రియ ఎక్కడ ఆగిందో.. అక్కడి నుంచే మొదలయ్యేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. నామినేషన్లను ఉపసంహరించడానికి గడువు వచ్చేనెల 2వ తేదీ. 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ అవకాశం ఉంటుంది. 3 గంటల తరువాత అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారులు విడుదల చేస్తారు. 10వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే.. 13వ తేదీన దాన్ని చేపడతారు. 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియ ఎక్కడ ఆగిందో.. అక్కడి నుంచే మొదలయ్యేలా నోటిఫికేషన్ జారీ చేయడం సరికాదని, దీన్ని మళ్లీ మొదటి నుంచీ చేపట్టేలా ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ ఈ పిటీషన్ దాఖలైనట్లు తెలుస్తోంది.