సీఎం జగన్ కు అండగా మోదీ..అమిత్ షా : రివర్స్ టెండరింగ్ కు గ్రీన్ సిగ్నల్ : టార్గెట్ చంద్రబాబు..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు గ్రేట రిలీఫ్. ఏపీలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన ప్రతిపక్షాలతో పాటుగా..పారిశ్రామిక వేత్తలకు షాక్ ఇచ్చే అంశం. జగన్ ముఖ్యమంతి అయిన నాటి నుండి విద్యుత్ కొనుగోళ్ల సమీక్ష..పోలవరం రివర్స్ టెండరింగ్ వంటి నిర్ణయాల పైనా జాతీయ స్థాయిలోనే కాదు..జపాన్ వంటి దేశాల నుండి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఏపీలోని బీజేపీ నేతలు జగన్ నిర్ణయాలను తప్పు బట్టారు. టీడీపీ నుండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సైతం జగన్ మీద తీవ్ర విమర్శలు చేసారు. అయితే, జగన్ తాను తీసుకున్న అన్ని నిర్ణయాలను ముందుగానే ప్రధాని మోదీ..కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వివరించి వారి అంగీకారంతోనే జగన్ నిర్ణయాలు తీసుకున్నట్లుగా తాజా సమాచారం. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీయటానికి సహకరించాలని జగన్ కోరగా..వారిద్దరూ మద్దతిచ్చినట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా..ఈ ముగ్గురి లక్ష్యం చంద్రబాబు అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో..జగన్ రానున్న రోజుల్లో వేసే అడుగులు మరింత కీలకం కానున్నాయి.
జగన్ నిర్ణయాల వెనుక మోదీ..అమిత్ షా
ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్న సమయంలో..వైసీపీ శ్రేణులకు ఊహించని వార్త బయటకు వచ్చింది. జగన్ గత ప్రభుత్వ అవినీతిని వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా మొండిగా వెళ్తున్నారని..దీని కారణంగా రాజకీయంగా నష్టపోతున్నామనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల సమీక్ష..పోలవరం విషయంలో నవయుగకు కాంట్రాక్టు రద్దు.. రివర్స్ టెండరింగ్ విషయంలోనూ జగన్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లు వెత్తాయి. అయితే, ముఖ్యమంత్రి ముందుగానే తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీకి..బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు ఏపీలో తమ అధ్యయనంలో వెల్లడైన విషయాలు..చోటు చేసుకున్న అవినీతి...తాను తీసుకోబోతున్న నిర్ణయాలను జగన్ వారి ముందుంచారు. అవినీతి జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రధాని మోదీతో పాటుగా అమిత్ షా సైతం వ్యాఖ్యానించినట్లు సమాచారం. వారిచ్చిన హామీ..అంగీకారం మేరకే జగన్ వడివడిగా నిర్ణయాలు తీసుకున్నట్లు అర్దం అవుతోంది. తన మీద పెద్ద ఎత్తున ఒత్తిడి ఉందని చెప్పిన జగన్ నిర్ణయాల విషయంలో మాత్రం వెనుకడుగు వేయటం లేదు. కేంద్ర ఇంధన శాఖా మంత్రితో పాటుగా జపాన్ సంస్థల నుండి జగన్ నిర్ణయాల మీద అభ్యంతరాలు వ్యక్తం అవుతూ లేఖలు వచ్చాయి. అయినా.. జగన్ తన నిర్ణయాలను మార్చుకోలేదు.
వారిద్దరి ఆశీస్సులతోనే..నిర్ణయాలు
జెరూసెలం పర్యటన నుండి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 6వ తేదీన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో మోదీతో దాదాపు 40 నిమిషాలు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఏపీలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని రంగాల వారీగా నివేదించారు. ప్రధానంగా జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం విషయంలో రెండు వేల కోట్లకు పైగా జరిగిన అవినీతి గురించి నిపుణులు ఇచ్చిన ప్రాధమిక నివేదికను సైతం మోదీకి అందించారు. అదే విధంగా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జరిగిన అవినీతి గురించి వివరించారు. వీటి మీద తాను కఠినంగా నిర్ణయాలు తీసుకోబోతున్నానని..మద్దతుగా నిలవాలని అభ్యర్ధించారు. వెంటనే ప్రధాని సైతం అవినీతిని కట్టడి చేసే నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనే జగన్ సమావేశమై ఇదే రకమైన వాదన వినిపించారు. జగన్ తాను పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లటం ద్వారా ఖర్చు తగ్గుతుందని చెప్పటంతో పాటుగా ప్రస్తుత కాంట్రాక్టర్ ను రద్దు చేస్తున్న విషయాన్ని అమిత్ షా కు వివరించినట్లు సమాచారం. ఆయన సైతం అంగీకరించటంతో జగన్ తిరిగి అమరావతికి రాగానే వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. నవయుగను పోలవరం బాధ్యతల నుండి తప్పించటంతో పాటుగా..పోలవరం విషయంలో రీ టెండర్లు ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
టార్గెట్ చంద్రబాబు..వ్యూహంలో భాగమేనా
చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయం నుండి జగన్ వాదిస్తున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత అదే విషయం పైన ప్రత్యేకంగా శ్రద్ద పెట్టారు. ఇక, అసెంబ్లీ వేదికగా నీరు చెట్టు.. అదే విధంగా విద్యుత్ కొనుగోళ్ల విషయంలోనూ జరిగిన అవినీతిని జగన్ వివరించారు. ఇక, ప్రధానికి..హోం మంత్రికి వివరించటంతో పాటుగా కొన్ని నివేదికలను సైతం అందించటంతో వారు వెంటనే అంగీకారం తెలిపారు. దీని ద్వారా వారి లక్ష్యం రాజకీయంగా చంద్రబాబు అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీకి వచ్చిన సమయంలోనే పోలవరం ఏపీ సీఎం చంద్రబాబుకు ఏటీయం గా మారిందని ఆరోపించారు. దీంతో..రాజకీయంగా ఏపీలోనే కాకుండా..జాతీయ స్థాయిలో తమను ఇబ్బంది పెట్టి..వ్యక్తిగత ఆరోపణలు చేసిన చంద్రబాబును రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే జగన్ నిర్ణయాలకు మద్దతు ఇవ్వక తప్పదనేది వారి అంచనాగా కనిపిస్తోంది. జగన్ నిర్ణయాలకు మద్దతు ప్రకటించటం కేవలం చంద్రబాబుకు మాత్రమే కాదు.. టీడీపీ నుండి బీజేపీలోకి వెళ్లి జగన్ పైన విమర్శలు చేస్తున్న నేతలతో పాటుగా..ఏపీ బీజేపీ నేతలకు ఇది ఒక రకంగా షాక్ గానే భావించాలి. దీంతో..ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటన నుండి వచ్చిన తరువాత రివర్స్ టెండరింగ్ విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.