సంక్షేమ పథకాలకు నిధులు ఏం కావాలి..? పోలవరం, సుజల స్రవంతికి లక్షకోట్లు: మంత్రి పేర్ని నాని
రాజధాని నిర్మాణం కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చుచేశారని, లక్షా 5 కోట్లు ఎప్పుడు వ్యయం చేయాలి, రాజధాని ఎప్పుడు అభివృద్ది చెందాలి అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. లక్ష ఐదు వేల కోట్లు కేటాయిస్తే సంక్షేమ పథకాలు ఏం కావాలి అని అడిగారు. ఐదేళ్లకు ఐదు వేల కోట్ల కేటాయింపుతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధాని నిర్మాణ ప్రక్రియ ఏన్నెళ్లకు పూర్తవుతుంది అని మంత్రి పేర్ని నాని కొశ్చన్ చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, వాటికి కేటాయిస్తోన్న నిధుల వివరాలను వివరించారు. మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియాతో మంత్రి నాని మాట్లాడారు.
ఐదేళ్లలో 5 వేల కోట్లు, లక్షా 10 కోట్లకు ఎన్నేళ్లు కావాలి, అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి పేర్ని
సాగునీటికి రూ.25 వేల కోట్లు
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు అవసరమవుతాయని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయితే సాగునీరుతో ఏపీ అన్నపూర్ణగా మారబోతుందని చెప్పారు. పాఠశాలల మరమ్మతులు, పునర్ నిర్మాణం కోసం రూ.12 వేల కోట్లు, ఆస్పత్రి మరమ్మతుల కోసం రూ.14 వేల కోట్లు, ఆరోగ్య శ్రీ కోసం రూ.3150 కోట్లు అవసరమవుతున్నాయని చెప్పారు.
పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ సాగునీటి కోసం లక్ష కోట్లు అవసరమవతాయని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న అమ్మ ఒడి పథకానికి రూ.6 వేల కోట్లు, పేదలకు ఇళ్లు నిర్మించేందుకు రూ.45 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామని చెప్పారు. ఏడాదికి 9 వేల కోట్ల చొప్పున ఇళ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తామని చెప్పారు.
వాటర్గ్రిడ్కు 40 వేల కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా మంచినీరు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని.. వాటర్ గ్రిడ్ కోసం రూ.40 వేల కోట్లు కావాలని పేర్కొన్నారు. ప్రకాశం, శ్రీకాకుళం శుభ్రమైన మంచినీరు లభించకపోవడంతో కిడ్నీలు చెడపోతున్నాయని మంత్రి పేర్ని నాని గుర్తుచేశారు. సాంఘిక సంక్షేమం, గిరిజన, బీసీ సంక్షేమం కోసం రూ.35 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు పేర్కొన్నారని తెలిపారు. పేదలకు రేషన్ అందించేందుకు రూ.10 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ.6 వేల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. పేదరికంలో ఉన్న కుటుంబాలు తమ పిల్లలను చదివించలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్తో వారికి ఆసరా లభిస్తోందని చెప్పారు.
ఉచిత విద్యుత్కు 3 వేల కోట్లు
రహదారుల నిర్మాణం, రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత కరెంట్ కోసం 3 వేల అవసరమవుతాయని చెప్పారు. సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించాలా ? లేదంటే పథకాలకు నిధులు ఆపివేసి రాజధాని నిర్మించాలా అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అలా అయితే హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో అమరావతి ఎప్పుడు పోటీ పడుతుందని ప్రశ్నించారు.