ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా అరెస్ట్ .. ఇది ప్రజాస్వామ్యమా .. జగన్ సర్కార్ పై కన్నా ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ పాలనా వైఫల్యాలను ఎండగట్టడం కోసం బిజెపి ఆధ్వర్యంలో గురజాలలో బహిరంగ సభ నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పోలీస్ యాక్ట్ 30 కూడా అమలులో ఉన్న కారణంగా సభ నిర్వహించడానికి వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు.అయినా సరే సభ నిర్వహిస్తామని గురజాల బయలుదేరిన ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
గురజాలలో బీజేపీ బహిరంగ సభ .. భగ్నానికి పోలీసుల యత్నం .. కన్నా అరెస్ట్ కు రంగం
పోలీసులు చెప్పిన విషయాన్ని లక్ష్యపెట్టకుండా బయలుదేరిన ఆయనను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి తిరిగి ఆయనను నగరానికి తీసుకెళ్లారు. గుంటూరు నగర శివారులో పార్టీ నేతలతో పాటు గురజాల కు బయలుదేరిన కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి వద్దనే నిలువరించే ప్రయత్నం చేసినా ఆయన పోలీసుల మాట లక్ష్యపెట్టకుండా బయలుదేరడం తో గురజాల మార్గంలోని రహదారులను దిగ్బంధం చేసిన పోలీసులు గుంటూరు శివారులో ఆయన వాహనశ్రేణిని నిలువరించి అరెస్టు చేశారు. అనుమతులు లేకుండా సభలు సమావేశాలు నిర్వహించి దానికి వీలు లేదని పోలీసులు తేల్చి చెప్పారు.
దీంతో పోలీసులకు బిజెపి శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బిజెపి రెండు ఘటనా స్థలంలోనే నిరసనకు దిగి జగన్ సర్కారు తీరుపై, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టి కన్నా లక్ష్మీనారాయణ అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి తిరిగి నగరానికి తీసుకు వెళ్లారు. ఇక వైసీపీ సర్కారు తీరు పై మండిపడిన కన్నా లక్ష్మీనారాయణ ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారు .
పల్నాడు లో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపడితే పోలీసులు గొంతు నొక్కే ప్రయత్నం చేసి అక్రమ అరెస్టు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధిని వెనక్కి పరిగెత్తించి కక్షసాధింపు రాజకీయాలే ప్రధాన అజెండా అంటూ కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.