కుదరని సెటిల్మెంట్... కక్షతోనే కారుకు నిప్పు... బెజవాడ కేసును చేధించిన పోలీసులు...
బెజవాడ నోవాటెల్ వద్ద కారును తగలబెట్టిన కేసును పోలీసులు చేధించారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారమే హత్యాయత్నానికి దారితీసినట్లు నిర్దారించారు. నిందితుడు వేణు గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేశామని,విచారణలో అతను నేరం అంగీకరించాడని డీసీపీ హర్ష వర్దన్ రాజు వెల్లడించారు. నమ్మి డబ్బులు ఇస్తే తననే మోసం చేశారన్న కారణంతోనే వేణు గోపాల్ రెడ్డి హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు.
మోసపోయిన వేణుగోపాల్ రెడ్డి...
డీసీపీ హర్షవర్దన్ రాజు వెల్లడించిన వివరాల ప్రకారం... వేణు గోపాల్ రెడ్డి గంగాధర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో చాలాకాలంగా పరిచయం ఉంది. గంగాధర్తో కలిసి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు కూడా పెట్టాడు. గంగాధర్పై నమ్మకంతో అతని మనిషిగా పరిచయమైన కృష్ణారెడ్డికి రూ.5కోట్లు అప్పు కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో గంగాధర్ వేణుగోపాల్ రెడ్డి మధ్య విబేధాలు తలెత్తాయి. గంగాధర్ తనను మోసం చేశాడని వేణు గోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అదే సమయంలో తాను కృష్ణారెడ్డికి అప్పుగా ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి రాలేదు.
కక్షతోనే హత్యకు ప్లాన్...
అప్పుగా ఇచ్చిన డబ్బును వెనక్కి ఇవ్వకపోవడంతో వేణు గోపాల్ రెడ్డి కొంతకాలంగా గంగాధర్,కృష్ణారెడ్డిలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. అటు రియల్ ఎస్టేట్లో మోసపోవడం,ఇటు ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడంతో వేణుగోపాల్ వారిపై కక్ష పెంచుకున్నాడు. దీంతో వారిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే సోమవారం (అగస్టు 17) సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పి గంగాధర్,కృష్ణారెడ్డిలను బెజవాడ నోవాటెల్ వద్దకు పిలిపించాడు.
24గంటల్లోనే నిందితుడి అరెస్ట్...
కారు నోవాటెల్ సమీపంలోని భారతీనగర్కు వచ్చాక... వేణుగోపాల్ రెడ్డి కూడా కారులో ఎక్కాడు. సెటిల్మెంట్ గురించి మాట్లాడుతుండగానే... హఠాత్తుగా కిందకు దిగి వెంట తెచ్చుకున్న పెట్రోల్ను కారుపై పోసి నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో గంగాధర్,అతని భార్య నాగవల్లి,కృష్ణారెడ్డిలు స్వల్పంగా గాయపడ్డారు. కృష్ణారెడ్డి కిందకు దిగి ప్రాణాలు కాపాడుకోగా... వెనుక సీట్లో కూర్చోవడంతో నాగవల్లి,గంగాధర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు వేణు గోపాల్ రెడ్డిని 24గంటల్లోనే అరెస్ట్ చేసి కేసును చేధించారు.