దుర్గ గుడి వెండి రథం మూడు సింహాల మాయం కేసు దర్యాప్తు ..ఫోరెన్సిక్ నివేదికతో పోలీసులకు షాక్ !!
విజయవాడ కనకదుర్గ అమ్మవారి వెండి రథంలో మూడు సింహాలు చోరీకి గురి కావటంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యటం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధిస్తున్నారు అనుకుంటే పోలీసులు నాలుగడుగులు ముందుకు వేస్తుంటే , ఎనిమిది అడుగులు వెనక్కు లాగుతున్నట్టు పరిస్థితులు ఉన్నాయి .
దుర్గ గుడి వెండి రథం మూడు సింహాల మాయం కేసు దర్యాప్తులో పురోగతి .. ఘటన ఎప్పుడు జరిగిందంటే
చోరీ జరిగిన తేదీలు తెలిసినా .. చోరీ చేసిన వారు తెలీలేదు
కనకదుర్గ అమ్మవారి వెండి రథంలో మూడు వెండి సింహాలు ఎప్పుడు మాయం అయ్యాయి అన్న దానిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఈ ఏడాది జూన్ నెలలో వెండి సింహాలు మాయం అయినట్టు గుర్తించారు. దీంతో ఈ కేసులో నిందితులను త్వరగానే పట్టుకుంటారని అంతా భావించారు . కానీ ఈ కేసులో నిందితులను పట్టుకోవటానికి కావాల్సిన ఆధారాలు దొరక్క పోలీసులు తలలు పట్టుకుంటున్నారు . ఎప్పుడో జరిగిందో తేదీలతో సహా గుర్తించినప్పుడు ఎవరు చేశారో కూడా గుర్తించే ఉంటారని అంతా భావించారు . కానీ ఎవరు ఈ పని చేశారనేది ఇంకా తేలకపోవటం ఆసక్తికర అంశం .
కేసు దర్యాప్తులో 100 మంది విచారణ
విజయవాడ కనకదుర్గ అమ్మవారి వెండి రధానికి ఉండవలసిన నాలుగు వెండి సింహాలలో మూడు సింహాలు మాయం కావటంతో ఏపీలో ఆలయాల రక్షణపై పెను దుమారం రేగింది . అంతకు ముందు అంతర్వేది రథం దగ్ధం ఘటనతో అమ్మవారి ఆలయంలో వెండి సింహాల చోరీ ఘటన పెద్ద చర్చకు కారణం అయింది . అయితే ఈ కేసును విచారిస్తున్న పోలీసులు కేసును చేదించటానికి సర్వ శక్తులు ఒడ్డుతున్నారు . ఈ కేసులో ఇప్పటి వరకు 100 మందిని పోలీసులు విచారణ జరిపారు .
ఆరు ప్రత్యేక బృందాలు .. ఆధారాలు లభించక పోలీసుల తిప్పలు
ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును త్వరగా తేల్చాలని యుద్ధ ప్రాతిపదికన విచారణ జరుపుతున్నా ఆధారాలు లభించకపోవటం పోలీసులకు ఇబ్బందిగా మారింది. మూడు సింహాలు ఒకేసారి మాయం కాలేదని , ఈ ఏడాది జూన్ 26వ తేదీన రెండు సింహాల విగ్రహాలు మాయమైనట్లుగా, ఆ తర్వాత జూన్ 29వ తేదీన మరో రెండు సింహాలు దొంగతనం చేయడానికి ప్రయత్నించినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే వారెవరు అన్నది తేలాల్సి ఉంది .
ఆధారాలు లేవని తేల్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్ .. దర్యాప్తులో తగ్గిన స్పీడ్
ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఇంతకాలం ఎదురు చూశారు పోలీసులు . అయితే ఫోరెన్సిక్ నివేదికలో ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది. దీంతో కేసులో ముందుకు ఎలా వెళ్ళాలో తెలియక పోలీసులు సతమతమవుతున్నారు . అయితే ఈ పని ఇంటి దొంగల పనే అని పోలీసులు భావిస్తున్నారు. కానీ వారెవరు అనేది ఇంకా తేల్చుకోలేకపోతున్నారు . దీంతో దర్యాప్తులో వేగం తగ్గింది. . త్వరగా తేలుతుంది అని భావిస్తే ఈ కేసులో ఆధారాలు లేక ఆధారాల కోసం పోలీసులు నానాపాట్లు పడుతున్నారు . అయితే రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా కేసు దర్యాప్తులో జాప్యం చేస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి .