తెరమీదికి స్వర్ణప్యాలెస్: సీఆర్పీసీ: డాక్టర్ రమేష్ పోతినేనికి నోటీసులు: సుప్రీం గ్రీన్సిగ్నల్తో
విజయవాడ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడలోని హోటల్ స్వర్ణా ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం ఉదంతం మరోసారి తెరమీదికి వచ్చింది. హోటల్ స్వర్ణ ప్యాలెస్లో కోవిడ్ కేర్ సెంటర్ను నెలకొల్పలిన డాక్టర్ రమేష్ పోతినేనికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ 160 కింద నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా విచారణ కొనసాగనుంది.
కిందటి నెల 9వ తేదీన తెల్లవారు జామున విజయవాడ గవర్నరు పేటలోని హోటల్ స్వర్ణా ప్యాలెస్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది మరణించారు. ప్రమాద సమయంలో 40 మంది పేషెంట్లు అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్ను రమేష్ గ్రూప్ ఆసుపత్రుల ఛైర్మన్ డాక్టర్ రమేష్ పోతినేని ఏర్పాటు చేశారు.
అగ్నిమాపక నిబంధనలను పాటించలేదని, కోవిడ్ మార్గదర్శకాలకు భిన్నంగా కేర్ సెంటర్ను నెలకొల్పారంటూ అప్పట్లో పోలీసులు నిర్ధారించారు. డాక్టర్ రమేష్ పోతినేనికి అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. ఈ సమాచారం తెలుకున్న వెంటనే ఆయన అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. చాలాకాలం పాటు పరారీలో ఉన్నారు. ఆయన తరఫు న్యాయవాదులు ఏపీ.హైకోర్టును ఆశ్రయించారు. దీనితో విచారణ కొనసాగించడంపై హైకోర్టు స్టే ఇచ్చింది.
Recommended Video
స్టే ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు.. స్టేను రద్దు చేసింది. విచారణ కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. దీనితో మరోసారి రమేష్ పోతినేనికి పోలీసులు తాజాగా నోటీసులను ఇచ్చారు. సీఆర్పీసీ సెక్షన్-160 కింద నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. కస్టోడియల్ విచారణ ఉండకపోవచ్చని సమాచారం. ఆయనను ఆన్లైన్ ద్వారా విచారణ చేపడతారని తెలుస్తోంది.