చంద్రబాబు పాదయ్రాతకు బ్రేక్, పోలీసులతో వాగ్వివాదం, రోడ్డుపై బైఠాయింపు
అమరావతి రాజధాని ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సుయాత్రను పోలీసులు అడ్డుకొన్నారు. విషయం తెలిసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మందడం డీఎస్పీ కార్యాలయానికి పాదయాత్రగా బయల్దేరారు. ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమను అడ్డుకోవడంతో పోలీసులతో చంద్రబాబు వాగ్వివాదానికి దిగారు.
చంద్రబాబు పాదయాత్ర
వాస్తవానికి చంద్రబాబు నాయుడు సాయంత్రం పాదయాత్ర చేపడుతానని ప్రకటించారు. టీడీపీ నేత బోండా ఉమా, సీపీఐ నేత రామకృష్ణ ఇతర నేతలతో కలిసి పాదయాత్ర చేపట్టారు. అయితే మహిళా రైతుల అరెస్ట్ తెలుసుకొని.. మందడానికి వచ్చేందుకు ర్యాలీగా బయల్దేరారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు బృందాన్ని పోలీసులు బెంజ్ సర్కిల్ వద్ద అడ్డుకొన్నారు.
సరికాదు
పోలీసులు అడ్డుకొవడాన్ని చంద్రబాబు టీం తప్పుపట్టింది. తమను ఎందుకు వెళ్లనీయడం లేదని ప్రశ్నించింది. ఇప్పటికే పాదయాత్ర చేపడుతానని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. మందడంలో తమ కార్యకర్తలను కలిసేందుకు వెళతానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు.
రోడ్డుపై బైఠాయింపు
ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పాదయాత్రను విరమించుకోవాలని చంద్రబాబుకు పోలీసుల సూచించారు. కానీ అందుకు చంద్రబాబు అంగీకరించలేదు. తమను ముందుకు వెళ్లనీయాలని కోరగా పోలీసులు అంగీకరించకపోవడంతో రోడ్డుపైనే బైఠాయించారు. జేఏసీ చట్ట ప్రకారం స్టేజీ క్యారియర్గా రవాణాశాఖ నుంచి అనుమతి తీసుకుందని చంద్రబాబు తెలిపారు. వారికి రాష్ట్రవ్యాప్తంగా తిరిగే హక్కు ఉందని చెప్పారు. కానీ ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకెళ్లి బస్సుయాత్రను నిలిపివేయడం సరికాదన్నారు.
బస్సుయాత్రకు బ్రేక్
అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సు యాత్రకు పోలీసులు బ్రేకులేశారు. తూళ్లూరు వద్ద అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ బస్సులను పోలీసులు నిలిపివేశారు. వాస్తవానికి జేఏసీ ఆర్టీఏ పర్మిషన్ తీసుకొని బస్సుయాత్ర చేపడుతోంది. కానీ తమ అనుమతి కూడా తీసుకోవాలని.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ వెళతారో రూట్మ్యాప్ కూడా ఇవ్వమని పోలీసులు అడగడంతో.. బస్సుయాత్ర ఆగిపోయిన సంగతి తెలిసిందే.