ఏపీలో కరోనా: కులం పేరుతో రచ్చ.. విజయసాయికి దిమ్మతిరిగే కౌంటర్.. కన్నా-సున్నా అంటూ..
ఆంధ్రప్రదేశ్లో కొవిడ్-19 కేసులతోపాటు పొలిటికల్ వైరస్ కూడా తాండవం చేస్తున్నది. కరోనా కేంద్రంగా అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసిన ఓ పజిల్ వైరలై దుమారం రేపుతోంది. జాతీయ స్థాయిలో కరోనాకు మతం రంగులు పూసే ప్రయత్నం జోరుగా సాగుతుండగా, ఏపీలో వైరస్కు కులాలను ఆపాదించే వికృతాలు జరుగుతున్నాయి.
కరోనా: పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. దేశం ముంగిట అతిపెద్ద సవాలు.. లాక్డౌన్ ఎత్తేసినా తిప్పలే..
కరోనా ఖాళీల పూరింపు..
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో జగన్ ఫెయిలయ్యారని, సీఎం స్థాయిలో అసంబద్ధ ప్రకటనలు చేస్తున్నారని, తద్వారా ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు చేసిన విమర్శలకు ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. ‘‘అంతా బాగున్నప్పుడే డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు ఎగ్గొట్టినోడు, ఫీజు రీఇంబర్స్ మెంటు ఇవ్వనోడు, ఇప్పుడేదో చేస్తానని చిటికెలేస్తున్నాడు. కరోనా సాకు చూపి కనీసం 10 వేల కోట్లు లేపేవాడు. దాన్ని చూసి కన్నాలు, సున్నాలు ఆహా ఓహో అనేవాళ్లు''అని మండిపడ్డారు. దీంతోపాటు కరోనాకు కొత్త అర్థం వచ్చేలా ఖాళీలు పూరించాలంటూ ఆయనో పజిల్ విసిరారు..
మామూలుగా ఇవ్వలేదు..
‘క... రో...న' చంద్రబాబు ఏడుపును చూసి ఈ ఖాళీలను పూరించండి అంటూ ఎంపీ ఓ సవాలు విసిరారు. ఆయన ఫాలోవర్లలో చాలా మంది దానికి ‘కమ్మరోదన‘, ‘కమ్మని రోగం నయంకాదు', ‘కరకట్ట రోగిష్టి నటన' అంటూ కులాన్ని ప్రస్తావిస్తూ కామెంట్లు పెట్టారు. అదే పజిల్ కు టీడీపీ శ్రేణులు.. ‘చంద్రబాబుపై శకుని తాత ఏడుపును చూసి ... పై ఖాళీలను పూరించండి' అంటూ మార్చేసి.. ఎంపీకి దిమ్మతిరిగే రీతిలో ‘కసాయి రోదన', ‘కసాయి రోత నోరు' అంటూ కౌంటర్లు విసిరారు. విజయసాయి చేసిన ట్వీట్ ను టీడీపీ అఫీషియల్ పేజీ సైతం రీట్వీట్ చేయడం గమనార్హం.
కరోనా ట్యూషన్..
అజ్ఞానం, మూర్ఖత్వం ఆవహించిన టీడీపీ నేతలు చంద్రబాబు హయాంలో మంత్రులుగా మేధావులమని బిల్డప్ ఇచ్చేవారని, కరోనాపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎంపీ మండిపడ్డారు. ‘‘కరోనా టెస్టులు ఎక్కువ చేసి చూపించడమేంటి? వ్యాధి విస్తరణకు ప్రభుత్వం కారణమవడమేంటి? కరోనా గురించి ట్యూషన్ పెట్టించుకునైనా తెలివి పెంచుకోంయ్యా''అని విమర్శించారు. వాంలంటీర్ల వ్యవస్థను దేశమంతా మెచ్చుకుంటున్నా, టీడీపీ, దాని అనుకూల మీడియా మాత్రం ఏడుస్తోందని తప్పపట్టారు. ‘‘ఎర్రటి ఎండలో సైతం ఇంటింటికి నాలుగు సార్లు తిరుగుతూ ప్రాణాలు ఫణంగా పెడుతోన్న వాంలంటీర్లు ఎక్కడ? ఏసీ గదుల్లో పడుకునే మీ బతుకులెక్కడ?''అని ప్రశ్నించారు.
Recommended Video
ఇదీ రాష్ట్రంలో సీన్..
మంగళవారం నాటికి ఏపీలో కరోనా కేసులు 1259కి పెరిగాయి. అందులో 258 మంది డిశ్చార్జి అయిపోగా, 31 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 332, గుంటూరు 254, కృష్ణాజిల్లాలో 223 కేసులు నమోదయ్యాయి. స్వైన్ ఫ్లూ, ఇతర వైరస్ల మాదిరిగా కరోనా కూడా చాలా కాలంపాటు మనతోనే ఉంటుందని, దాంతో కలిసి జీవించడానికి సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. గడిచిన నెల రోజుల్లో వైద్య రంగాన్ని బలోపేతం చేశామని, మే 3 తర్వాత గ్రీన్ జోన్లలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తామని సీఎం చెప్పారు. ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం సీఎం ఆలోచనను తప్పుపట్టాయి.