వేడెక్కిన బెజవాడ తూర్పు రాజకీయం .. అవినాష్ ఎంట్రీ వెనుక పెద్ద కథే !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెజవాడ తూర్పు రాజకీయాలు, తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో హాట్ హాట్ గా మారాయి. తెలుగుదేశం పార్టీ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిన యువనేత దేవినేని అవినాష్ నియోజకవర్గ ఇంచార్జ్ గా బాధ్యతలు స్వీకరించడంతో నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీని, గద్దె రామ్మోహన్ ని టార్గెట్ చేస్తూ దేవినేని అవినాష్ ను రంగంలోకి దింపారని ప్రధానంగా చర్చ జరుగుతోంది.
నిన్న దేవినేని అవినాష్..రేపు వల్లభనేని వంశీ..నెక్స్ట్ కాట్రగడ్డ?: వేడెక్కిన బెజవాడ
బెజవాడ తూర్పు రాజకీయాల్లో పట్టు కోసమే దేవినేని అవినాష్ ఎంట్రీ
గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి హవా కొనసాగినప్పటికీ విజయవాడ తూర్పు రాజకీయాల్లో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన బొప్పన భవ కుమార్ పరాజయం పాలయ్యారు. విజయవాడ తూర్పులో టిడిపి నుండి బరిలోకి దిగిన గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. దీంతో స్థానికంగా టిడిపి తన పట్టును నిలుపుకుంది. ఈ క్రమంలోనే విజయవాడ తూర్పులో వైసిపి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి అని భావించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు దేవినేని అవినాష్ ను విజయవాడ తూర్పు రాజకీయాల్లోకి తీసుకు వస్తే బాగుంటుందని భావించారు.
చక్రం తిప్పిన వైసీపీ కీలక నేతలు
ఒక పక్క రాష్ట్రంలో టిడిపి పరాజయం పాలుకావడం, యువ నేత దేవినేని అవినాష్ వంటివారు టిడిపి అధినాయకత్వం పట్ల అసంతృప్తితో ఉండడం వంటి కారణాలు వైసీపీ నేతలకు కలిసొచ్చాయి. ఇక దీంతో ఆయనను వైసీపీలో తీసుకురావడానికి వై వీ సుబ్బా రెడ్డి, విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైన పొట్లూరి వరప్రసాద్, వైసిపిలో రింగ్ మాస్టర్ గా చెప్పుకునే విజయ సాయి రెడ్డి వంటి నేతలు రంగంలోకి దిగి విజయవాడ తూర్పు రాజకీయాలలో కీలకంగా వ్యవహరించాలని కోరారు.
Recommended Video
వైసీపీ చేరేందుకు అవినాష్ కు బంపర్ ఆఫర్
ఇక ఇదే ప్రపోజల్ తనకు ఏదైనా ఒక నియోజకవర్గాన్ని అప్పగించమని టిడిపి అధినాయకత్వం వద్ద దేవినేని అవినాష్ చాలా రోజుల నుంచి పెట్టారు. కానీ టిడిపి నేతలు మళ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉన్నందున, ఇప్పటి నుంచి అవసరం లేదంటూ మాట దాటవేశారు. ఇక అదే వైసీపీ నేతలు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలను అప్పగిస్తామని, వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి టికెట్ కేటాయిస్తామని, ఇక రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దేవినేని అవినాష్ అనుచరులకు టిక్కెట్లు ఇస్తామని, పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత తీసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేయాలని ఆఫర్ ఇచ్చారు.
వైసీపీ తీర్ధం పుచ్చుకున్న అవినాష్ .. నియోజకవర్గ ఇంచార్జ్ గా బాధ్యత
ఇక ఈ ఆఫర్ నచ్చిన దేవినేని అవినాష్ వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న దేవినేని అవినాష్ తో జగన్ అరగంటపాటు మంతనాలు జరిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యత తీసుకొని రానున్న ఎన్నికల్లో విజయవాడ తూర్పులో పార్టీని గెలిపించాలని ప్రధానమైన బాధ్యతను దేవినేని అవినాష్ పై పెట్టి మరీ పంపించారు.ఇక దీంతో విజయవాడ తూర్పు నియోజకవర్గం లో మకాం వేసిన దేవినేని అవినాష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏకతాటి మీదకు తీసుకు వచ్చే పనిలో పడ్డారు.
టిడిపి నేత గద్దె రామ్మోహన్ కు చెక్ పెట్టాలనే రంగంలోకి అవినాష్
అవినాష్ చేసే ప్రయత్నానికి సొంత పార్టీ నేతల వల్ల ఎలాంటి అవాంతరం కలగకుండా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన బొప్పన భవ కుమార్ కు జగన్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, నీ విషయం నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే బెజవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, టిడిపి నేత గద్దె రామ్మోహన్ కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే దేవినేని అవినాష్ ను రంగంలోకి దించినట్లు గా నియోజకవర్గంలో పెద్ద చర్చ జరుగుతోంది.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పట్టున్న నేత గద్దె రామ్మోహన్
గద్దె రామ్మోహన్ స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండే, మంచి పేరు ప్రతిష్టలున్న నేత. అందుకే గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నాయకులు ఓటమిపాలైనా గద్దె రామ్మోహన్ మాత్రం విజయం సాధించారు. ప్రతినిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే గద్దె రామ్మోహన్ ను ఢీ కొనాలంటే అది సామాన్యమైన విషయం కాదు. అందుకే దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ ను రంగంలోకి దించారు. దేవినేని నెహ్రూ ఉన్న కాలంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఆయనకు చాలా పట్టుంది.
అవినాష్ కు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల టాస్క్ .. తూర్పులో పొలిటికల్ హీట్
ఇక ఈ నేపథ్యంలోనే కుమారుడు అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రంగంలోకి దిగారు.గత ఎన్నికల్లో కూడా దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నుండి టికెట్ ఇవ్వాలని కోరారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు గుడివాడ టికెట్ కేటాయించారు. అక్కడ కొడాలి నానీ చేతిలో అవినాష్ ఓటమి పాలయ్యారు. ఇక ఇప్పుడు వైసీపీ కీలక పదవిని , బాధ్యతను అప్పగించింది. మున్సిపల్ ఎన్నికలు లక్ష్యంగా, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టిడిపి చెక్ పెట్టే విధంగా, టిడిపి నుండి వచ్చిన యువనేత దేవినేని అవినాష్ ను రంగంలోకి దించడం వైసీపీ వేసిన తెలివైన స్టెప్ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో అక్కడ ప్రస్తుత రాజకీయాలు రసవత్తరంగా మారాయి అని చెప్పాలి.