సంక్రాంతి అంటే చీర్ డ్యాన్స్ కాదు.. సోము వీర్రాజు సెన్సేషనల్ కామెంట్స్
గుడివాడ కేసినో వివాదం చల్లారడం లేదు. దాని చుట్టే విమర్శలు- కౌంటర్ అటాక్ జరుగుతున్నాయి. ఇవాళ బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు కామెంట్ చేశారు. సంక్రాంతి పండుగ ఎలా జరుపుకోవాలో నేర్పిస్తామని ఆయన అన్నారు. విజయవాడలో ఉద్యోగులకు మద్దతుగా ఆయన దీక్షలో పాల్గొన్నారు. అక్కడినుంచి పార్టీ నేతలతో కలిసి గుడివాడకు బయలుదేరారు. క్యాసినో సంస్కృతిని కట్టడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బ్యానర్లు తొలగింపు
సంక్రాంతి ముగింపు సంబరాల్లో పాల్గొనేందుకు గుడివాడలో బీజేపీ నేతల పర్యటన సందర్భంగా నిన్న ఆ పార్టీ కార్యకర్తలు బ్యానర్లు కట్టారు. ఆ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. కొన్ని ఫ్లెక్సీలు కడుతుండగా అడ్డుకున్నారు. ఈ ఘటనపై సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో క్యాసినో కలకలం చెలరేగిన నేపథ్యంలో బీజేపీ నేతలు అక్కడ పర్యటించనుండడం ఉత్కంఠ రేపుతోంది.
చీర్ డ్యాన్స్ కాదు
సంక్రాంతి అంటే చీర్ డ్యాన్సులు కావని.. కొడాలి నాని తెలుసుకోవాలని సోము వీర్రాజు అన్నారు. సంక్రాంతి ఎలా జరుపుకోవాలో తాము చూపిస్తామని చెప్పారు. గుడివాడ పర్యటనపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. మధ్యాహ్నం బీజేపీ పార్టీ నేతలతో కలసి గుడివాడ వెళుతున్నామని చెప్పారు. క్యాసినో కావాలా, చీర్ గర్ల్స్ కావాలా , హరిదాసులు, గంగిరెద్దులు, ధర్మం, మన తెలుగు సంక్రాంతి సంస్కృతి కావాలో గుడివాడ నుండి రాష్ట్ర ప్రజలను అడుగుతాం అని ఆయన అన్నారు. బీజేపీ నేతలు గుడివాడలో పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Recommended Video
వివాదం ఇలా
గుడివాడ కేసినో వివాదం అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. బుద్దా వెంకన్న చేసిన హాట్ కామెంట్స్ అరెస్ట్కు దారితీసింది. తాజాగా దీనిపై మంత్రి కొడాలి నాని స్పందించారు. అల్జీమర్స్ జబ్బుతో బాధపడుతున్న చంద్రబాబు విపక్షనేతగా ఉండడం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం అని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. టీడీపీతోపాటు మీడియాలో ఓ వర్గం తనపై దృష్టి పెట్టిందని ఆయన ఆరోపించారు. తనను మంత్రి పదవీ నుంచి తప్పించాలన్నదే చంద్రబాబు ప్రయత్నం అని వివరించారు. గుడివాడలో తన 'కే కన్వెన్షన్లో కేసినో జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేశారు. ఆ తర్వాత టీడీపీ.. ఇప్పుడు బీజేపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.