సుజనాచౌదరికి చిక్కులు తప్పవా? విజయసాయిరెడ్డి లేఖపై స్పందించిన రాష్ట్రపతి, హోంమంత్రికి లేఖ
రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత సుజనాచౌదరిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పందించారు. సుజనా చౌదరి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి విజయసాయిరెడ్డి రాసిన లేఖను కేంద్ర హోంమంత్రి వద్దకు పంపించారు. దీంతో సుజనా చౌదరిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తోందా అనే అంశం చర్చకొచ్చింది. అయితే ఆయన ఇప్పుడు బీజేపీలో ఉండటంతో నరేంద్ర మోడీ 2.0 ప్రభుత్వం ఆదేశిస్తోందా అనే అనుమానాలు మాత్రం ఉన్నాయి.
ఎంక్వైరీ జరిపించండి
యలమంచిలి సుజనాచౌదరి ఆర్థిక నేరాలపై విచారించాలని విజయసాయిరెడ్డి రాష్ట్రపతికి లేఖ రాశారు. అందులో అక్రమ కంపెనీలు నెలకొల్పారని, మనీ ల్యాండరింగ్ చేశారని, ఇంటర్నేషనల్ స్కానర్ అని పేర్కొన్నారు. సుజనాచౌదరి అక్రమ వ్యవహారాలపై ఈడీ, సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరారు. దీనిపై భారత రాష్ట్రపతి కార్యాలయ కార్యదర్శి అలోక్ కుమార్ పాల్ స్పందించారు. విజయసాయిరెడ్డి లేఖను ప్రస్తావిస్తూ హోంమంత్రిత్వ శాఖకు పంపించారు.
హోంశాఖకు లేఖ
విజయసాయిరెడ్డి పంపించిన లేఖపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఆ లేఖనే హోంమంత్రిత్వ శాఖకు పంపించారు. దీంతో హోంమంత్రిత్వ శాఖ కూడా లేఖను సంబంధిత శాఖలకు పంపించింది. విజయసాయిరెడ్డి లేఖకు స్పందించి విచారణ ప్రారంభమైతే సుజనా చౌదరి ఇబ్బందుల్లో పడతారనే ఊహాగానాలు వినిపిస్తోన్నాయి.
బీజేపీలోకి..
అయితే సుజనా చౌదరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీజేపీ చీఫ్ అమిత్ షా కేంద్ర హోంమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. తమ ఎంపీపై రాష్ట్రపతి భవన్ స్పందించడంపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారనే చర్చకు దారితీసింది. తమ ఎంపీపై కూడా విచారణ జరిపితే.. సుజనా చౌదరి ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఖాయం. అయితే ఆయన ప్రాబ్లమ్స్లో పడతారా ? మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందా అనే చర్చ జరుగుతుంది.