చంద్రబాబూ! భార్యను విడిచి పారిపోయావని మోడీ అనలేదు: పురంధేశ్వరి దిమ్మతిరిగే కౌంటర్
అమరావతి: భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు పురంధేశ్వరి మంగళవారం తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా గట్టి కౌంటర్లు ఇచ్చారు. బీజేపీ కార్యకర్తల అంకితభావం వల్ల మోడీ సభ విజయవంతమైందని, అందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నామన్నారు.
ప్రధానికి స్వాగతం పలికేందుకు మంత్రులు రాకపోవడం శోచనీయం
ఏపీలోని మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను జాతీయం చేస్తానని వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి నిరోధకులా, దానికి హాజరుకాని వారు అభివృద్ధికి అడ్డుపడుతున్నవారా ప్రజలు అర్థం చేసుకోవాలని పురంధేశ్వరి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్లే ఇప్పుడు ఏపీలో గ్రామాల అభివృద్ధి జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రతి సర్పంచ్ గుర్తెరగాలని కోరారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు మంత్రులు రాకపోవడం శోచనీయం అన్నారు. నమో యాప్ ద్వారా కార్యకర్తల నుంచి విరాళాలు సేకరిస్తామని చెప్పారు.
'వైయస్ జగన్ చెప్పాడా... అయితే ఒకే.. ఇదీ చంద్రబాబు నాయుడు మాట'
టీడీపీ కారణంగా మేమూ భయపడ్డాం
అధికార తెలుగుదేశం పార్టీ ఎన్ని అవరోధాలు కల్పించినా ప్రధాని మోడీ సభ విజయవంతమైందని పురంధేశ్వరి తెలిపారు. తమ సభ ఫెయిల్ అయిందనే వారికి ఆమె ఓ ప్రశ్న సంధించారు. జన సందోహాన్ని మీడియానే చూపించిందని, జనం రాలేదంటే మేం ఏం చెబుతామని అన్నారు. ఓ సమయంలో తాము కూడా సభ గురించి భయపడ్డామన్నారు. భయపడటానికి కారణాలు కూడా చెప్పారు. టీడీపీ అడ్డుకునే ప్రయత్నాలు చేసిందని, సభకు వస్తున్న వాహనాల్లో గాలులు తీశారని, దానికి వెరవకుండా సభ విజయవంతమైందని చెప్పారు. పలుచోట్ల చేయి చేసుకున్నారని, కర్రలతో కొట్టారన్నారు.
గుండెమీద చేయి చేసుకొని ఆలోచించాలి
టీడీపీ గత కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తోందని, అందుకే ప్రధాని మోడీ తన సభలో అన్ని విషయాలను చెప్పారని పురంధేశ్వరి గుర్తు చేశారు. మోడీ సభ ద్వారా వివరణ ఇచ్చారని చెప్పారు. కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందా, పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా చేయలేదా, నిధులు అన్నీ కేంద్రానివి కావా, సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి వచ్చే నిధుల ద్వారా అమలు కావడం లేదా.. వీటన్నింటిపై ఏపీ ప్రజలు ఒక్కసారి గుండెమీద చేయి వేసుకొని ఆలోచించాలని కోరారు. గ్రామాల్లో అభివృద్ధి కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే అవుతోందన్నారు.
మోడీ చేసిన వ్యక్తిగత విమర్శలు ఏమిటి?
ప్రధాని మోడీ.. సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని టీడీపీ చెబుతోందని అనగా పురంధేశ్వరి గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు వ్యక్తిగత విమర్శలు ఎక్కడ చేశారని ప్రశ్నించారు. నాకు అర్థం కావడం లేదని, మోడీ... చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు ఏం చేశారో చెప్పాలన్నారు. అమరావతి నుంచి పోలవరం వరకు అవినీతి జరిగిందని చెప్పారని, అది నిజమేనని అంతకుమించి మాట్లాడలేదన్నారు. ఏం మాట్లాడారో (వ్యక్తిగత విమర్శలు) మీడియా చెప్పినా లేదా వ్యక్తిగత విమర్శలు చేశారని ఆరోపించిన వారు (చంద్రబాబు) చెప్పినా మేం సమాధానం చెబుతామన్నారు. భార్యను విడిచి పారిపోయావని, మీకు కుటుంబం లేదని మోడీ ఏమీ విమర్శించలేదన్నారు. మోడీకి యావత్ భారతదేశమే కుటుంబం అన్నారు. ఆయనకు ఏదైనా బంధం, అనుబంధం, సంబంధం ఉందా అంటే అది భారతదేశంతో అన్నారు. ఆయనకు కుటుంబం ఎక్కడ లేకుండా ఉందని చెప్పారు. అలాంటి వ్యక్తిగత విమర్శలకు మోడీ దిగజారలేదని, కానీ ఏపీలో జరిగిన అవినీతిని ప్రశ్నించారన్నారు.