నోట్లరద్దుతో ఏంజరిగిందంటే, అందుకే మోడీని గద్దె దింపాలని బాబు ప్రయత్నం: పురంధేశ్వరి సంచలనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తెలుగుదేశం పార్టీయే అడ్డుకుందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మహిళా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మంగళవారం అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగీకరించారని తెలిపారు. ఇప్పుడేమో దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు.
సుజనా చౌదరిని పక్కన పెట్టుకొని జైట్లీ ప్యాకేజీ ప్రకటన చేశారు
టీడీపీ ఎంపీ సుజనా చౌదరిని పక్కన పెట్టుకొనే నాడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని పురంధేశ్వరి గుర్తు చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సాయం అందిస్తోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం కేంద్రం నిధులు అందించడం శుభపరిణామమని అన్నారు. ఇందుకు ప్రధాని మోడీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబు దుమ్ముదులిపిన పురంధేశ్వరి
అనుమానాలు నివృత్తి చేస్తే నిధులు
కేంద్రం అనుమానాలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇస్తే నిధులు ఇవ్వడానికి ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమని పురంధేశ్వరి చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజుపట్నం పోర్టులపై కేంద్రానికి అనుమానాలు ఉన్నాయని చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదికలు ఇవ్వలేదని చెప్పారు. విశాఖపట్నం రైల్వే జోన్ విషయమై సంప్రదింపులు జరుపుతున్నామని, జోన్ ఇవ్వడానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. గుంటూరు మోడీ సభ విజయవంతమైందన్నారు.
నల్లకుబేరుల పని పట్టినందుకు చంద్రబాబు గద్దె దింపాలని చూస్తున్నారు
నోట్ల రద్దు వల్ల 3.5 లక్షల డొల్ల కంపెనీలు మూతపడ్డాయని పురంధేశ్వరి చెప్పారు. నల్లకుబేరుల పని పట్టినందుకు మోడీని గద్దె దించాలని చంద్రబాబు చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ వల్ల దేశంలో కొత్త కంపెనీలు పెరిగాయన్నారు. కేంద్ర సకహకారం ేలకుండా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లేవని చెప్పారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలుకు కేంద్రం భారీగా నిధులు ఇస్తోందని చెప్పారు. ప్రధాని మోడీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని చెప్పారు. కేంద్రం ఇస్తున్న నిధులు రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు.
ఎందుకో విపక్షాలు చెప్పాలి
ప్రధాని మోడీని తొలగించాలని విపక్షాలు చెబుతున్నాయని, కానీ ఎందుకు తొలగించాలో చెప్పాలని పురంధేశ్వరి నిలదీసారు. నల్లకుబేరుల పని పట్టినందుకు మోడీనితొలగించాలా, రుణాలు ఎగ్గొట్టిన వారి పని పడుతున్నందుకు మోడీని తొలగించాలా అని ప్రశ్నించారు. ఆదాయపన్ను కట్టే వారి సంఖ్య పెరిగిందని చెప్పారు. కేంద్ర భాగస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏదీ జరగదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై సవరించిన డీపీఆర్కు జలవనరుల శాఖ ఆమోదించిందని ఆర్థిక శాఖ నుంచి ఆమోదం వచ్చాకే నిధులు వస్తాయన్నారు.