ఆర్టికల్ 370 రద్దుపై కమల్ హాసన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పీవీపీ
కేంద్రంలోని బిజెపి సర్కార్ ఆర్టికల్ 370 రద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయపార్టీలకు అతీతంగా చాలామంది మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం సాహసోపేతమయిన నిర్ణయమని ప్రశంసిస్తుంటే, ఇక విమర్శిస్తున్న వారు కూడా లేకపోలేదు.ఆర్టికల్ 370 రద్దు ఏకపక్షమని, నిరంకుశ, తిరోగమన చర్య అని విమర్శించారు ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్. ఇది ప్రజాస్వామ్యం పై జరిగిన దాడి అని అభివర్ణించిన కమలహాసన్ కాశ్మీర్ ప్రజల పై కేంద్రం తీసుకున్న చర్యలను తీవ్రంగా ఆక్షేపించారు. ఇక ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత, ప్రముఖ నిర్మాత పీవీపీ .
ఏపీ ప్రభుత్వ మద్యం షాపులు .. రిహార్సల్స్ ప్రారంభిస్తున్న అధికారులు
కమల్ హాసన్ వ్యాఖ్యలను వైసీపీ నేత, ప్రముఖ నిర్మాత పీవీపీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. "తిరోగమన చర్య, నిరంకుశత్వం, సంప్రదింపులు జరిపితే బాగుండేది అంటూ మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలు చూశాను. కొన్నాళ్ల కిందట, సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఓ రాష్ట్ర విభజన జరిగినప్పుడు మీరు కూడా ప్రజల తరఫున గళం వినిపిస్తారని ఆశించాం. మీకెంతో పేరుప్రఖ్యాతులు, అదృష్టాన్ని అందించిన రాష్ట్రం అది. కానీ ఆనాడు మీరు స్పందించలేదు" అంటూ ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని లేవనెత్తి, అప్పుడు కమల్ హాసన్ ఎందుకు స్పందించలేదు అంటూ ప్రశ్నించారు పొట్లూరి వరప్రసాద్.
కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై అటు నెటిజన్ల నుండి కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. భారతీయుడు సినిమా చేసిన కమల్ హాసన్ నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు నెటిజన్లు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరి ఆమోదం పొందుతుంటే కమల్ హాసన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అంటున్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు ముక్కలుగా చేసిన సమయంలో మాట్లాడని కమల్ హాసన్ ఇప్పుడు జమ్మూకాశ్మీర్ పునర్విభజన అంశంపై మాట్లాడటం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. పెద్ద ఎత్తున తెలుగు సినిమాలు చేసి ,తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని , తెలుగు ప్రజలు తమ దేవుళ్లని చెప్పిన కమల్ హాసన్ రెండు తెలుగు రాష్ట్రాలు గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతుంటే చోద్యం చూశారు ఎందుకని పీవీపీ చాలా ఆవేదనతో ప్రశ్నించారు.