వారం రోజుల పాటు విజయవాడ స్టేషన్ కు రైళ్లన్నీ రద్దు-రైల్వేశాఖ క్లారిటీ ఇదే
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో రైళ్ల రాకపోకలకు సంబంధించి ఓ వార్త షికార్లు చేస్తోంది. విజయవాడ రైల్వే స్టేషన్లో సిగ్నలింగ్ వ్యవస్ధ ఆధునీకీకరణ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకూ అంటే తొమ్మిది రోజుల పాటు స్టేషన్ కు వచ్చే అన్ని రైళ్ల రాకపోకల్ని రద్దు చేసినట్లు ఈ ప్రచారం జరుగుతోంది. దీంతో వందలాది రైళ్లకు ఈ 9 రోజుల పాటు రద్దు లేదా దారిమళ్లించడం చేస్తున్నట్లు ఈ ప్రచారం సారాంశం.
సుమారు తొమ్మిది రోజులపాటు 118 రైళ్లను (రానుపోను) రద్దు, పాక్షిక రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం ఎం.యల్వేందర్యాదవ్ తెలిపారంటూ ఈ వార్త ప్రచారంలోకి రావడంతో అంతా నిజమే అనుకున్నారు. రెండురోజులుగా జరుగుతున్న ఈ ప్రచారంపై రైల్వేశాఖ ఇవాళ క్లారిటీ ఇచ్చింది. విజయవాడ యార్డులో నాన్-ఇంటర్ లాకింగ్ వ్యవస్ధ లో మరమ్మతులపై జరుగుతున్న ప్రచారంపై తాము స్పందిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ప్రస్తుతం విజయవాడ రైల్వే యార్డులో ఎలాంటి నాన్-ఇంటర్ లాకింగ్ పనులు జరగడం లేదని, దీనిపై ప్రచారంలో ఉన్న ఫేక్ మెసేజ్ ను నమ్మవద్దని రైల్వే అధికారులు తెలిపారు. గత నెల 20వ తేదీలోపే ఈ పనులు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. కొండపల్లి పరిధిలో ఈ పనులు జరుగుతున్నట్లు సర్కులేట్ అవుతున్న మెసేజ్ ఫేక్ అని వారు తెలిపారు. ఇంటర్ లాకింగ్ వ్యవస్ధ పనుల కారణంగా రైళ్లన్నీ రద్దయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజయవాడ రైల్వే డివిజన్ ప్రజాసంబంధాల అధికారి ప్రకటించారు.