బెజవాడలో రామ్గోపాల్ వర్మ: జోహార్ ఎన్టీఆర్ అంటూ హల్చల్!
విజయవాడ: వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించారు. ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేయలేని పనిని ఇప్పుడు చేసి చూపించారు. విజయవాడలోని పైపుల్ రోడ్డులో గల ఎన్టీ రామారావు విగ్రహానికి పూల మాల వేశారు. నివాళి అర్పించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినదించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఆయన విజయవాడకు వచ్చారు. స్థానిక హోటల్లో బస చేశారు. మధ్యాహ్నం పైపుల్ రోడ్లోని ఎన్టీ రామారావు విగ్రహానికి చేరుకున్నారు. విగ్రహానికి నిలువెత్తు పూల మాల వేసి నివాళి అర్పించారు. ఆ సమయంలో ఆయన వెంట- లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి ఉన్నారు.
నివాళి అర్పించిన తరువాత వర్మ అక్కడే కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. తాను అనుకున్నది చేశానని సంతృప్తిని వ్యక్తం చేశారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తీస్తున్నానని అన్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ దశలో ఉందని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్లో సినిమా విడుదల చేయాలని భావిస్తున్నట్లు రామ్గోపాల్ వర్మ తెలిపారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడి కాకముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రచారంలో భాగంగా- రామ్గోపాల్ వర్మ విజయవాడకు రాగా.. తెలుగుదేశం నాయకులు ఆయనను అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అత్యంత అవమానకరంగా రామ్గోపాల్ వర్మ విజయవాడను విడిచి పెట్టి వెళ్లారు. సినిమా ప్రమోషన్ కోసం విజయవాడకు వచ్చిన యూనిట్ మొత్తాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
రామ్గోపాల్ వర్మను విజయవాడ నగరంలో అడుగు కూడా పెట్టనివ్వలేదు పోలీసులు. ఆయనతో పాటు చిత్రం యూనిట్ ను వాహనంలో ఎక్కించుకుని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపేశారు. విమానాశ్రయం నుంచి బయటికి రానివ్వలేదు. అక్కడే నిర్బంధించారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది.