టీడీపీ ఎంపీ కేశినేని తమ్ముడినంటూ మోసాలు- రూ.3 కోట్ల రుణం పేరుతో టోకరా...
విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని పేరుతో జరిగిన ఓ మోసం తాజాగా బయటపడింది. స్వయానా ఎంపీ సోదరుడినంటూ జనాన్ని మోసం చేసిన ఘటన చోటు చేసుకుంది. ఎంపీ సోదరుడినని చెప్పడంతో పలువురు ఆయన చేతిలో మోసపోయినట్లు తెలుస్తోంది. దీనిపై తాజాగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని సోదరుడినంటూ కేశినేని రమేష్ అనే వ్యక్తి జనాన్ని మోసం చేస్తున్నాడు. హెచ్ఆర్ఎం ఫైనాన్స్ సంస్ధ ఎండీనంటూ ఓసారి, గేట్ వే హోటల్ పార్ట్నర్ అంటూ మరోసారి పలువురిని బురిడీ కొట్టించాడు. ఇదే కోవలో గుంటూరు జిల్లా నల్లపాడులో ఓ స్ధలం సేల్ డీడ్ సెటిల్ చేస్తానంటూ రంగంలోకి దిగిన రమేష్.. లక్షలు కాజేశాడు. రమేష్ను నమ్మిన దూడల రుషికేశ్వర్ అనే వ్యక్తి అతనికి రూ.20 లక్షలు సమర్పించుకున్నాడు. ఇప్పుడు లబోదిబోమంటున్నాడు.
గుంటూరులో ఓ వివాదంలో ఉన్న స్ధలం సేల్ డీడ్ ఇప్పిస్తానంటూ దాని విలువ రూ.3 కోట్లుగా రుషికేశ్వర్ను రమేష్ నమ్మించాడు. ఈ డీల్ పూర్తి చేసేందుకు రూ.20 లక్షలు తీసుకున్నాడు. ఎంతకీ సెటిల్ కాకపోవడంతో ప్రశ్నిస్తే రూ.80 లక్షల రూపాయలకు నకిలీ చెక్ ఇచ్చి తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధితుడు రుషికేశ్వర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేశినేని రమేష్ ఇంకా ఎవరెవరిని మోసం చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.