డబల్ ఎంట్రీ! ఎస్బీఐలో ఘరానా కుంభకోణం: రైతుల బంగారానికి కన్నం
విజయవాడ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు, రైతులకు భారీగా మోసగించాడో ఉద్యోగి. కుచ్చుటోపి పెట్టాడు. మామూలుగా కాదు.. కోటి రూపాయలకు పైగా విలువైన బంగారాన్ని దోచుకుని పరారయ్యాడు. కృష్ణా జిల్లాలోని కంచికచెర్ల మండలం పరిటాల ఎస్బీఐలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఉద్యోగి పేరు శ్రీనివాస్. పరిటాల శాఖా కార్యాలయంలో క్యాషియర్గా ఉద్యోగం చేస్తున్నాడు.
రుణాల కోసం బ్యాంకుకు వచ్చే రైతులు, నిరక్షరాస్యులైన ఖాతాదారులను టార్గెట్గా చేసుకున్నాడు. వారు రుణాలను తీసుకోవడానికి తాకట్టు పెట్టిన బంగారాన్ని రెట్టింపు చేసి చూపాడు. రైతులు తాకట్టు పెట్టిన బంగారాన్ని రికార్డుల్లోకి నమోదు చేయకుండా.. దానికి సంబంధించిన వివరాలను మాత్రమే అందులో ఎక్కించేవాడు. బంగారాన్ని తాను తస్కరించేవాడు.
అనుమానం వచ్చిన రైతులు, ఇతర ఖాతాదారులు ఆరా తీయగా, అసలు విషయం తేలింది. బాధితుల పేరు మీద రెండు ఖాతాలు ఉన్నట్లు తేలింది. ఖాతాదారులకు చెందిన సుమారు కోటి రూపాయల రుణ మొత్తాన్ని మెక్కేసి, పరారైనట్లు తెలుస్తోంది. బ్యాంకులో 700 మంది ఖాతాదారులు రుణాలు తీసుకోగా- వారిలో 40 మందికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాడు. వారికి తెలియకుండా తాకట్టు పెట్టిన బంగారాన్ని మరోసారి కొత్తగా పెట్టినట్టు ఖాతాలను సృష్టించాడు.
రైతులు, ఇతర ఖాతాదారులు బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని డబుల్ ఎంట్రీ చేశాడు. పాత బంగారాన్నే కొత్తగా డిపాజిట్ చేసినట్లు రికార్డులను సృష్టించాడు. ఈ విషయం బయటపడటంతో బ్యాంకు ముందు ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఇప్పటికిప్పుడు తమ బంగారాన్ని చూపించాలంటూ వారు పట్టుబట్టారు.
బ్యాంక్ మేనేజర్ బంగారాన్ని కొంతమందికి చూపిస్తున్నారు. మరి కొంతమంది ఖాతాదారులు రుణ మొత్తాన్ని బ్యాంకుకు కడుతున్నారు. తమ బంగారాన్ని వెనక్కి ఇవ్వమని అడుగుతున్నారు. బ్యాంకు మేనేజర్ ఖాతాలకు హామీ ఇస్తూ మీరు తీసుకున్న లోన్ మాత్రమే కట్టండని సర్ది చెప్పి ఖాతాదారులను శాంతింపజేశారు.