దేవుడ్ని నమ్మేవాళ్లే టార్గెట్.. శివలింగం ఆకృతిలో పచ్చరాయి వేలం.. 2 కోట్ల బేరం బెడిసికొట్టిందిగా..!
విజయవాడ : మాటలే పెట్టుబడిగా మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. నమ్మించి నట్టేట ముంచుతున్నారు. మోసగాళ్ల మాటలకు అమాయకులే కాదు ఉన్నత విద్యావంతులు కూడా పల్టీ కొడుతున్నారు. పూటకో వేషమేస్తూ రోజుకో మోసం చేస్తున్న కంత్రీగాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. పోలీసులు ఏరిపారేసినా.. మళ్లీ మళ్లీ మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.
ఇక రాళ్లు, రప్పలకు అతీత శక్తులు ఉన్నాయంటూ జనాలను బురిడీ కొట్టించే మోసగాళ్ల లీలలకు అంతే లేకుండా పోతోంది. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్న చందంగా సొల్లు కబుర్లు చెప్పి ఏదో ఒకటి కట్టబెట్టి లక్షలకు లక్షలు మింగేస్తున్న మాయగాళ్లు రోజుకో చోట దర్శనమిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో కృష్ణా జిల్లాలో శివలింగం పేరుతో ఏకంగా వేలం పాట పెట్టడం చర్చానీయాంశంగా మారింది.
దేవుడిపై నమ్మకం ఉన్నోళ్లే టార్గెట్..!
ఐదుగురు వ్యక్తులు ఒకటయ్యారు. దేవుడిపై నమ్మకం ఉన్నోళ్లు వారి టార్గెట్. ఇంకేముంది ఎవరినైనా బకారాలను చేసి కోట్లు కొల్లగొడదామని ప్లాన్ వేశారు. అయితే అది కాస్తా రివర్సయి టాస్క్ఫోర్స్ పోలీసుల వలకు చిక్కారు. మోసం చేయబోయి చివరకు కటాకటాలపాలయ్యారు. వేలు, కాదు లక్షలు కాదు ఏకంగా రెండు కోట్లు కొల్లగొడదామని స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయారు.
కృష్ణా జిల్లా నందిగామకు చెందిన రంగాచార్యులు.. ఖమ్మంకు చెందిన బాలాజీ.. రాజమండ్రికి చెందిన శ్రీనివాస్, సుధాకర్.. కంచికచర్ల జగన్నాథపురానికి చెందిన దిలీప్కుమార్ పాత స్నేహితులు. ఇటీవల ఈ ఐదుగురు కలిసి ఒక్కటయ్యారు. ఆ క్రమంలో శివలింగం ఆకృతిలో ఉన్న పచ్చరాయి ఒకటి సేకరించారు. దాన్ని పథకం ప్రకారం గనక అమ్మితే కోట్లు వస్తాయని భావించారు. దేవుడంటే బాగా నమ్మే వ్యక్తులు ఆ శివలింగాన్ని చూడగానే కొంటారని భ్రమపడ్డారు.
ఆర్మీపై రాళ్లు వేస్తే ఇక చేతులుండవు.. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్ (వీడియో)
జెమాలజిస్ట్ ధృవీకరణ పత్రం అంటూ.. కోట్టు దండుకునే ప్లాన్..!
ఆ శివలింగం వశం చేసుకుంటే అదృష్టం మీ సొంతమంటూ ప్రచారం చేశారు. ఇది మీ దగ్గరుంటే కోటీశ్వరులవుతారంటూ బురిడీ కొట్టించే ప్రయత్నానికి ఒడిగట్టారు. ఆ క్రమంలో జనాలను నమ్మించడానికి హైదరాబాద్ లోని "జెమ్ టెస్టింగ్ ల్యాబ్" లో జెమాలజిస్ట్ పర్యవేక్షించి జారీచేసినట్లుగా ఓ ధృవపత్రం కూడా క్రియేట్ చేశారు. దాదాపు 4 కిలోల 400 గ్రాముల బరువు తూగే ఎమరాల్డ్ (పచ్చ) రాయి అని అందులో పేర్కొన్నారు. ఆ క్రమంలో దాన్ని అమ్మేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా విజయవాడలో పలుచోట్ల బేరానికి పెట్టారు. కానీ వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఇలా అమ్మకానికి పెట్టగానే కోట్లు రాలతాయని భావించిన వారి ఆశలు ఆడియాసలయ్యాయి.
వేలం పాట.. 2 కోట్లకు బేరం.. చివరకు చిక్కారిలా..!
ఎలాగైనా ఆ శివలింగం అమ్మడానికి కంకణం కట్టుకున్నారు ముఠా సభ్యులు. ఆ క్రమంలో సోమవారం (06.08.2019) సాయంత్రం నాడు విజయవాడకు 16 కిలోమీటర్ల దూరంలోని ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ దగ్గరకు చేరుకున్నారు. ఆ పచ్చరాయి శివలింగానికి అతీత శక్తులున్నాయని.. ఎవరు దక్కించుకుంటే వారు కోటీశ్వరులైపోతారని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ మేరకు జెమలాజిస్ట్ జారీ చేసినట్లుగా చెబుతున్న ధృవీకరణ పత్రం చూపించారు. అలా హడావిడి చేస్తూ ఏకంగా వేలం పాట నిర్వహించి అమ్మే ప్రయత్నం చేశారు.
2 కోట్ల మేర ధర పలుకుతుందంటూ ఏకధాటిగా మాయమాటలు చెబుతూ ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డారు. అయితే సాధారణ పౌరుల్లాగా అక్కడకు వచ్చి వారితో మాటలు కలిపిన టాస్క్ఫోర్స్ పోలీసులు బేరసారాలు సాగించారు. వారితో కూడా అలాగే ఘంటాపథంగా చెప్పారు. ఆ శివలింగం ఎవరు దక్కించుకుంటే వారు కోటీశ్వరులైపోతారని చెప్పుకొచ్చారు. దాంతో ఆ ఐదుగురు సభ్యులు జనాలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని టాస్క్ఫోర్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని అదుపులోకి తీసుకుని తదుపరి దర్యాప్తు కోసం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.