విజయవాడలో లాక్ డౌన్ .. లైట్ తీసుకున్న ప్రజలు.. యథావిథిగా రాకపోకలు- రద్దీగా దుకాణాలు..
విజయవాడలో కరోనా వైరస్ ప్రభావం కారణంగా కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ ప్రభావం కనిపించడం లేదు. ఉదయం నుంచి ప్రజలు రోడ్లపైకి వచ్చేశారు. ప్రజారవాణా లేకపోవడంతో సొంత వాహనాల్లోనే తిరుగుతూ షాపింగ్ ప్రారంభించేశారు. ప్రధాన రహదారుల్లో షాపులు మూతపడగా.. మిగతా చోట్ల మాత్రం యథావిథిగా పనిచేస్తున్నాయి.
Recommended Video
విజయవాడలో నో లాక్ డౌన్..
పారిస్ నుంచి ఢిల్లీకి అక్కడి నుంచి విజయవాడకు చేరుకున్న ఓ విద్యార్ధికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన నేపథ్యంలో కేంద్రం నిన్న లాక్ డౌన్ ప్రకటించింది. నగరంలో ప్రజలు రోడ్లపైకి రావొద్దని, ప్రకటించిన వేళల్లో మాత్రమే నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. అయితే నగరంలో అధికారుల ఆదేశాలు ఏమాత్రం అమలు కావడం లేదు. ప్రజలు ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చి దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ముఖ్యంగా కూరగాయలతో పాటు పాలు, పండ్ల కోసం ఎగబడుతున్నారు.
జనం రోడ్లపైకి ఎందుకంటే ...
కేంద్రం లాక్ డౌన్ ప్రకటించినా జనం దాన్ని పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చేయడానికి ప్రధాన కారణం కరోనా ప్రభావం ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు. ఇంట్లో కూరగాయలు, అత్యవసర వస్తువులు తెచ్చుకోకపోతే రాబోయే రోజుల్లో కరోనా పేరుతో పూర్తిగా అన్నీ మూసేస్తే తమ పరిస్ధితి ఏంటనే భయం వారిలో కనిపిస్తోంది. దీంతో ఉదయం నుంచే షాపులు వెతుక్కుంటూ తిరగడం కనిపిస్తోంది. లాక్ డౌన్ ప్రకటించిన తొలిరేజే కావడంతో అధికారులు కూడా పూర్తిస్దాయిలో ఆంక్షలు విధించడం లేదు.
మండుతున్న ధరలు...
కరోనా వైరస్ ప్రభావంతో విజయవాడలో లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ్టి నుంచే ధరల మోత మొదలైపోయింది. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోకుండా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. నిత్యావసర వస్తువులను వెంటనే అమ్మకుండా దాచిపెడుతూ ధరలు పెంచేస్తున్నారు. దీంతో ఇవాళ పలుచోట్ల కూరగాయల ధరలు కేజీ వంద రూపాయలకు చేరుకున్నాయి. అయినా కొనక తప్పని పరిస్ధితి ఉండటంతో ప్రజలు నగరంలో కూరగాయల కోసం రోడ్ల వెంట తిరుగుతున్నారు.
తొలి రోజే ఈ పరిస్ధితి ఉంటే..
కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ ప్రకటించిన తొలిరోజే విజయవాడ నగరంలో కూరగాయలు, నిత్యావసరాల ధరలు మండిపోతుంటే మరో 9 రోజుల్లో పరిస్ధితి ఏ స్ధాయికి చేరుతుందో తెలియక జనం ఆందోళన చెందుతున్నారు. తొలిరోజు ఆంక్షలు కాస్త తక్కువగా ఉన్న నేపథ్యంలో స్టాక్ లు పెట్టుకునేందుకు వివరీతంగా రోడ్లపైకి వస్తున్నారు. ఇదే అదనుగా వ్యపారులు వారిని దోచుకుంటున్నారు. ఇవాళ, రేపే స్టాక్ ఉంటుంది కాబట్టి ధర ఎక్కువైనా కొనుక్కుని వెళ్లాలన్న వ్యాపారుల మాటలు ఇప్పుడు జనంలో ఆందోళన మరింత పెంచుతున్నాయి. అయితే ప్రభుత్వం ఈ పరిస్దితిని ఏ విధంగా అధిగమిస్తుందో చూడాలి.