బిడ్డకు పాలిస్తుండగా, తల్లి స్తనంపై కాటేసిన పాము.. బిడ్డ కోసం ఆ తల్లి ఏం చేసిందంటే
చిన్నారికి పాలు ఇస్తుండగా ఓ పాము తల్లి స్తనంపై కాటేయడంతో ఆ తల్లి మరణించిన విషాద సంఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. అయితే మరణానికి ముందు తన బిడ్డను కాపాడుకోవటం కోసం ఆ తల్లి చేసిన ప్రయత్నం తల్లిప్రేమకు అద్దం పడుతుంది . ఈ పాము కాటు ఘటనలో అదే పాము కాటుకు మరో యువకుడు ప్రాణాపాయంలో చిక్కుకున్నాడు . ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
మహారాష్ట్ర చంద్రపూర్ మండలం సోనాపూర్ నుంచి కొందరు కూలీలు కూలీ పనుల నిమిత్తం కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం లోని ఊటుకూరు వచ్చారు. సదరు కూలీలు మిరప కోతలకు వెళ్తున్నారు . వారంతా గ్రామంలోని బీసీకాలనీ స్కూల్ వద్ద ఒక గుడారంలో ఉంటున్నారు .
అయితే రాత్రి సమయంలో అందరూ నిద్రపోతుండగా ఒక చిన్నారి పాప ఆకలితో ఏడ్చింది . దీంతో పాప తల్లి శృతి ప్రమోద్ భోయర్ తన బిడ్డ ఆకలి తీర్చటం కోసం పాలిచ్చారు .
అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక పాము తల్లి రొమ్ము భాగంపై కాటేసింది . పాము బిడ్డను కూడా కాటేస్తుందేమో అని భయపడిన ఆ తల్లి దాన్ని చేత్తో పట్టుకుని బయటకు విసిరేసి బిడ్డను కాపాడుకుంది . అయితే తల్లి పామును బయటకు విసిరేసిన క్రమంలో అక్కడే నిద్రిస్తున్న రూపేష్ ప్రకాష్ చప్డే అనే యువకుడిపై ఆ పాము పడటంతో అతడిని సైతం పాము కాటేసింది. దీంతో అతను ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు .ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.
బిడ్డకు పాలిస్తూ పాము కాటుకు గురైన తల్లిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది . యువకుడి పరిస్థితి మాత్రం ప్రస్తుతం విషమంగా ఉంది .శృతి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు పోలీసులు .