ఏపీలో విషం చిమ్ముతున్న సర్పాలు..! కృష్ణా జిల్లా వాసులను వెంటాడుతున్న కాల నాగులు..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపిలో పాములు రెచ్చిపోతుపోతున్నాయి. ఏకంగా జనావాసాల్లోకి విషపర్పాలు చేరుకోవడంతో జనాలు బిక్కుబిక్కు మంటున్నారు. పాములు సాధారణంగా వర్షం కురిస్తే భయటకు వస్తాయి. అయితే వర్షాకాలం మొదలైన నేపథ్యంలో కృష్ణా జిల్లా పరీవాహక ప్రాంతాల్లో బయటకు వచ్చిన పాములు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పాముల సంచారం గణనీయంగా పెరగడంతో, వాటి కాటు బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది.
వర్షాలు మొదలైన తరువాత అవనిగడ్డ ప్రాంతంలో దాదాపు 30 మందిని పాములు కాటు వేసాయి. అందులో ఒకరు మరణించారు. ఇటీవల 28 మంది పాముకాటుకు గురై, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందారు. వీరందరికీ పాము విషానికి విరుగుడు వాక్సిన్లు ఇచ్చామని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే ఆరుగురు ఆసుపత్రికి పాము కాటుతో వచ్చారని చెప్పారు. పాముల బెడద తమకు నిద్రలేకుండా చేస్తోందని ప్రజలు వాపోతున్నారు.
ఏపి వ్యాప్తంగా పాముల దాడి..! బెంబేలెత్తుతున్న జనం..!!
వానాకాలం మొదలయింది. ఇన్నిరోజులు గుట్టు చప్పుడు లేకుండా ఉన్న...క్రిమి కీటకాలు, పాములు, తేల్లు..ఇతర చల్లటి వాతావరణానికి మెల్లగా బయటకి వస్తుంటాయి..ఇక ఇది ఇలా ఉంటే.. కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతంలో పాత కథే పునరావృతమవుతుంది .గతంలో మాదిరిగానే దివిసీమ ప్రాంతంలో పాముల బెడద అధికమైంది.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ 72 మంది పాముకాటు బారిన పడ్డారు. పాముకాటుకు గురై బుధ, గురువారాల్లో ఇద్దరు మృతి చెందటంతో దివిసీమ ప్రజలు పాముల భయంతో వణుకుతున్నారు. ఈ ప్రాంతంలో మూడేళ్ల నుండి ఈ పరిస్థితి తలెత్తుతున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు.
2017లో 466 మంది, 2018లో 558 మంది పాముకాటుకు గురయ్యారు.ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో అందించాల్సిన వైద్య సేవలకు అవసరమైన పరిస్థితులు లేకపోవడం సమస్యగా మారింది. పాముకాటుతో ఇటీవల ఇద్దరి మృతికి ఇదే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాచుపాము, కట్లపాము కరిచిన సందర్భాల్లో విష తీవ్రత అధికంగా ఉంటే కాటుకు గురైన వ్యక్తి సృహ తప్పిపోవడం, ఊపిరి అందక శ్వాసతీసుకోవడం కష్టంగా మారుతుంది.
పాము కాటుకు లేదు సరైన వైద్యం..! ఏరియా ఆస్పత్రుల్లో వసతులు జీరో..!!
రక్తపింజేరి వంటి పాముకాటుకు గురైతే కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. వీరికి యాంటీస్నేక్ వీనమ్ ఇంజక్షన్లను అందించాలి. ఊపిరితిత్తుల్లోకి కృత్రిమ శ్వాస గొట్టం (ఎండో ట్రేఖియల్ ట్యూబ్) ద్వారా, యాంబు బ్యాగ్తో కృత్రిమ శ్వాస అందించాలి. అత్యవసరమైన వెంటిలేటర్ మిషన్ కేవలం విజయవాడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లోనే ఉంది.
అవనిగడ్డ నియోజకవర్గ కేంద్రమైన అవనిగడ్డ, చల్లపల్లిలో ఏరియా ఆస్పత్రులు, ఘంటసాల, మోపిదేవి, కోడూరు, నాగాయలంక, నడకుదురు గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు వీలుగా ఐసియు యూనిట్ ఒక్కటి కూడా లేకపోవడం సమస్యగా మారింది.
ఈ నేపథ్యంలో సకాలంలో వైద్యం అందక పాముకాటుకు గురైన వారిలో కొందరు మృతి చెందుతున్నారు. దివిసీమ ప్రాంతంలోని ఒకటి, రెండు ఆస్పత్రుల్లోనైనా ఐసియు సౌకర్యాలు కల్పించడం ద్వారా పాముకాటుకు గురైన వ్యక్తుల మరణాలను నివారించేందుకు అవకాశం ఉంటుంది.
వర్షాకాలం ప్రారంభం..! రెచ్చిపోతున్న నాగరాజాలు..!!
ఏరియా ఆస్పత్రులు, పిహెచ్సిల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం దివిసీమ నుంచి సుమారు రెండున్నర గంటలపాటు ప్రయాణించి విజయవాడకు చేరుకోవాల్సి వస్తోంది. దీంతో, అప్పటికే పరిస్థితి విషమిస్తోంది. చికిత్స చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. సమీపంలో మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉంటే జతిన్, సీతమ్మ ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేది.
ఇద్దరి మృతి తర్వాత అవనిగడ్డ, చల్లపల్లిలోని ఏరియా ఆస్పత్రులతోపాటు పిహెచ్సిల్లోనూ యాంటీ స్నేక్ వీనం ఇంజక్షన్లను అందుబాటులో ఉంచారు. ఈ ఇంజక్షన్ల వల్ల కొంతమేర ప్రయోజనం ఉంటుందని వైద్యనిపుణులు అంటున్నారు. అయితే, ఆరోగ్య పరిస్థితి విషమిస్తే ఈ ఇంక్షన్ ఇవ్వడంతోపాటు అత్యవసర చికిత్స అందించాలి. ఐసియులో ఉంచాలి. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాలి.
ఏపీలో ఎక్కువగా నదీ పరీవాహక ప్రాంతాలు..! వృద్ది చెందుతున్న పాముల సంతానం..!!
ఏరియా ఆస్పత్రిల్లోనూ, పిహెచ్సిలోనూ అత్యవసర చికిత్సకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, లేబరేటరీలు, పరికరాలు వంటివి అందుబాటులో లేవు. దీంతో, పరిస్థితి విషమించిన వారిని విజయవాడ తరలించాల్సిన పరిస్థితులున్నాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం ఇటీవల కాలంలో పూర్తిగా తగ్గింది.
నదీ, కాలువ గట్లు, సముద్ర తీరాల్లో ముళ్లకంపలు, తుప్పలు విపరీతంగా పెరిగాయి. ఇవి పాముల సంతాన వృద్ధికి కారణంగా మారాయి. వర్షాలకు పుట్టల్లోకి నీరు చేరడంతో పాములు జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్నాయి. ఇళ్లు, గడ్డివాములు, పొలాల్లోని గట్లపై అత్యధిక సంఖ్యలో చేరుతున్నాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా పాముకాటుకు గురికావాల్సిన పరిస్థితులు ఉన్నాయి.