ఆన్లైన్ రమ్మీ నిషేధం బీజేపీ సాధించిన విజయం అంటూనే జగన్ కు సోము వీర్రాజు మరో సూచన
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. నిన్న ఏపీ అసెంబ్లీ భేటీలో ఆన్ లైన్ రమ్మీ, పోకర్ వంటి గ్యాంబ్లింగ్ పై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా
ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ప్రభుత్వం నిషేధించడం బీజేపీ సాధించిన విజయమని ఆయన పేర్కొన్నారు.
ఆన్ లైన్ రమ్మీ పై నిషేధం ... గ్యాంబ్లింగ్ సంస్థలకు చెక్ పెట్టేలా.. జగన్ సర్కార్ ప్రణాళిక
ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ వల్ల ప్రజల సొమ్ము దోపిడీకి గురవుతుందని, ప్రజల ఆలోచనా ధోరణిలో దారుణమైన మార్పులు వస్తున్నాయని తాను మే 2020లో సీఎం జగన్ మోహన్ రెడ్డి కి లేఖ రాసి ఆయన దృష్టికి తీసుకు వచ్చాను అని గుర్తుచేశారు. అంతేకాదు బిజెపి నేతలు ఆన్ లైన్ రమ్మీ నిషేధించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇక దీనితోనే ప్రస్తుతం ఆన్ లైన్ రమ్మీ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.ఈ రోజు ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేయడం ఏపీ బీజేపీ సాధించిన విజయంగా సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు .
గతంలో రాసిన లేఖలో గుట్కా నిషేధం పై కూడా ప్రస్తావించానని, అప్పటికే ప్రభుత్వం గుట్కాను నిషేధించినప్పటికీ కిరాణా షాపులలో , పాన్ షాప్స్ లో గుట్కా ఇంకా విక్రయిస్తున్నారని, గుట్కా అమ్మకాలను అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరానని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏపీలో గుట్కా అమ్మకాలపై కూడా దృష్టిసారించి, వాటిని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సోము వీర్రాజు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో బిజెపి చేస్తున్న డిమాండ్లపై, ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.