ప్రయాణికులకు షాక్: రైల్వే ప్లాట్ఫాం టికెట్ రేట్లు భారీగా పెంపు
హైదరాబాద్: దసరాకు ముందు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్లు రేట్లు పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. దసరా పండగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ప్లాట్ ఫాం టికెట్ పెంచినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం టికెట్ ధర రూ. 10 ఉండగా.. దాన్ని ఇప్పుడు రూ. 30కి పెంచడం గమనార్హం. అయితే, అక్టోబర్ 10 వరకు మాత్రమే ఈ పెంచిన రేట్లు అమలులో ఉండనున్నాయి. ఆ తర్వాత సాధారణ రేట్లే అమలు కానున్నాయి.
పెంచిన టికెట్ ధరలు విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి స్టేషన్లలో అమలవుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏటా సంక్రాంతి, దసరా పండగ సమయాల్లో ప్లాట్ ఫాం టికెట్ ధరను పెంచుతున్న విషయం తెలిసిందే.
ప్రయాణికులకు వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులు, స్నేహితుల రద్దీని నివారించడంలో ఆదాయం పెంచుకోవడానికి ఏటా టికెట్ ధరను దక్షిణ మధ్య రైల్వే తాత్కాలికంగా పెంచుతోంది. గతంలో రూ. 10 నుంచి టికెట్ రూ. 20కి పెంచిన రైల్వే శాఖ.. ఇప్పుడు మాత్రం రూ. 30 పెంచడం గమనార్హం.
ప్లాట్ ఫాం టికెట్ ధరను భారీగా పెంచడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో పెంచితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఇలాంటి ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.