ప్రత్యేక హోదా జగన్ కు మోడీ , కేసీఆర్ ఇస్తారు తీసుకోమనండి అంటూ కేఏ పాల్ వ్యంగ్యాస్త్రాలు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఎన్నికల ఎంటర్ టైనర్ కేఏ పాల్ కాబోయే సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అభిమానులకు అందుబాటులోకి వచ్చిన పాల్ ప్రత్యేక హోదా జగన్ కు కేసీఆర్, మోడీ ఇస్తారు తీసుకోమనండి అంటూ సెటైర్లు వేశారు.
నేర చరిత్రలో వైసీపీ ఎమ్మెల్యేలదే అగ్రస్థానం .. ఏపీ ఎమ్మెల్యేలు ఎందరిపై క్రిమినల్ కేసులున్నాయంటే ?
నవరత్నాల హామీలను అందిస్తానంటున్నారు జగన్ .. ఎలా చేస్తారో చూస్తా అంటున్న పాల్
నవరత్నాలు పేరిట హామీ ఇచ్చిన జగన్ ఈ నెల 30 నుంచి అన్నీ పంచుతానని చెబుతున్నాడని, పంచుతాడో లేదో చూస్తానని అన్నారు. జగన్ మాట నిలబెట్టుకుంటాడనే ఆశిస్తున్నానని కేఏ పాల్ తెలిపారు. లైవ్ స్ట్రీమింగ్ లో ఓ నెటిజన్ జగన్ కు సపోర్ట్ చేయండి అని కోరగా, ఆ మాట అడగాల్సింది జగన్ అని, జగన్ అడిగితే ఎందుకు సపోర్ట్ చేయను? అంటూ తిరిగి ప్రశ్నించారు.అంతే కాదు మరో ప్రశ్న వెయ్యకుండా పాల్ సమాధానం చెప్పారు. జగన్ కు దైవప్రార్థన అవసరమైతే ఆయనే అడగాలి, జగన్ కు అభివృద్ధి అవసరమైతే ఆయనే అడగాలి, మరి ఆయన అడుగుతాడా? నువ్వు అడుగుతావా? అంటూ ఆ నెటిజన్ నోరు మూయించారు పాల్ .
జగన్ కు ప్రత్యేక హోదా కేసీఆర్, మోడీ ఇస్తారు తీసుకోమనండి అంటూ సెటైర్లు వేసిన పాల్
ఇక జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ కేసీఆర్ ను సపోర్ట్ అడిగారు, కేసీఆర్ ను ఇమ్మనండి స్పెషల్ స్టేటస్! మోదీని కూడా వెళ్లి కలిశాడు, మోదీ స్పెషల్ స్టేటస్ ఇస్తాడు తీసుకోమను అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అంత ఈజీగా వచ్చేది కాదని ఆయన ఎద్దేవా చేశారు. వందల మంది దేశాధినేతలతో పరిచయాలు కావాలన్నా, బిలియనీర్లు రావాలన్నా తనను సపోర్ట్ అడగాలని కేఏ పాల్ ఈ సందర్భంగా జగన్ కు సూచించారు. జగన్ అడగనిదే తానేం చేయగలనని పాల్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రాభివృద్ధి కావాలంటే జగన్ తన సహకారం కోరితే చేస్తా అంటున్న పాల్
ఇక జగన్ అడిగితే రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తానని చెప్పిన పాల్ మరో ప్రశ్నకు సమాధానంగా, జగన్ తనను ప్రమాణస్వీకారానికి పిలవలేదని, పిలిస్తే ఎందుకు రాను? అని బదులిచ్చారు. జగన్ పై ఎన్నికలకు ముందు నిప్పులు చెరిగిన పాల్ ఇప్పుడు చల్లబడ్డాడు . జగన్ అడిగితే తను సహకారం అందిస్తానని చెప్తున్నారు. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు మాగ్జిమం 300 ఓట్లకు మించి రాలేదు. ఎవరుదాకో ఎందుకు... స్వయంగా పశ్చిమ గోదావరి జిల్లా... నర్సాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన పాల్ కి 281 ఓట్లు మాత్రమే వచ్చాయి. నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి కూడా పోటీ చేయగా... 2,987 ఓట్లు వచ్చాయి. కానీ పాల్ మాత్రం డిపాజిట్లు రాకున్నా సంచలనాలను మాత్రం ఆపలేదు.