కేంద్ర కేబినెట్ లోకి వైసీపీ..!? రెండు మంత్రి పదవులు ఆ ఇద్దరికే: వ్యూహం ఇదే..లక్ష్యం వారే..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొత్త రాజకీయ వ్యూహాలకు తెర లేపుతున్నారు. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్..గతంలో కేంద్ర కేబినెట్ లో చేరుతారనే ప్రచారం జరిగినా..అది జరగలేదు. ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు..మతపరమైన విమర్శలు..ప్రభుత్వానికి ఆర్దిక ఇబ్బందులు..కేంద్ర సాయం..వంటి అంశాలను పరిశీలించిన తరువాత కేంద్ర కేబినెట్ లో చేరాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందు కోసం ఇప్పటికే ప్రాధమిక చర్చలు సైతం పూర్తయినట్లుగా పార్టీలో ప్రచారం సాగుతోంది.
రెండు కేబినెట్ బెర్తులు వైసీపీకి ఇవ్వబోతున్నారని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతున్న ప్రచారం. ఆ రెండు పదవులు ఎవరికో సైతం చెప్పేస్తున్నారు. అయితే, జగన్ కు కీలకమైన మైనార్టీ..దళిత ఓటు బ్యాంకు పైన ప్రభావం పడుతుదనే భావనతో ఇంతకాలం కేంద్ర ప్రభుత్వంలో చేరటం పైన జగన్ సంశయించారు. అయితే, వారికి ఏ మాత్రం నష్టం కలగకుండా తాను చూసుకుంటాననే నమ్మకం కలిగిస్తూ..ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో దీని పైన తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
తుని విధ్వంసం కేసులు ఎత్తివేత: భోగాపురం నిరసనకారుల పైన కేసులు మాఫీ: కేబినెట్ లో కీలక నిర్ణయం..!
కేంద్ర కేబినెట్లో ఇద్దరు వైసీపీ మంత్రులు..!?
వైసీపీలో ఇప్పుడు ఒక చర్చ హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర కేబినెట్ లో వైసీపీ చేరబోతోందని దీని సారాంశం. దీనికి తోడుగా ఢిల్లీలో వైసీపీ ఎంపీ ఒకరు విందు ఇచ్చిన సమయంలో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరే పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఎన్డీఏ నుండి శివసేన వెళ్లిపోవటం..ఏపీ నుండి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేవకపోవటం తో వైసీపీ నుండే కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పించే దిశగా ఆలోచనలు సాగుతున్నాయనని తెలుస్తోంది. అయితే..గతంలో టీడీపీ కేంద్రలో మంత్రి పదవులు తీసుకున్న సమయంలో ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పోషించిన పాత్రనే..ఇప్పుడు టీడీపీ రిపీట్ చేస్తుందని..అందులో ప్రధానంగా హోదా మీద ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందనే అభిప్రాయం కొందరు ఎంపీలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఎలా ఉన్నా..ముందు ఏపీలో ఉన్న ఆర్దిక పరిస్థితులు..ముందున్న సవాళ్లను పరిగణలోకి తీసుకుంటున్న వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వంలో చేరటమే మంచిదనే అభిప్రాయపడుతున్నారు.
ఆ ఇద్దిరికే పదవులు అంటూ..
వైసీపీ కేంద్రం ప్రభుత్వంలో చేరటం పైన అటు బీజేపీ..ఇటు వైసీపీ అధికారికంగా ప్రకటన చేయకపోయినా..వైసీపీ నుండి కేంద్ర మంత్రులుగా ఇద్దరి పేర్లు ప్రచారం లో ఉన్నాయి. అందులో ఒకటి పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి కాగా..రెండో పేరు పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి అవకాశం ఉందని కొందరు చెబుతుండగా.. కాపు లేదా ఎస్సీ కేటగిరీల్లో మహిళా ఎంపీకి రెండో మంత్రిగా పార్టీ నుండి కేంద్రంలో అవకాశం కల్పించే విధంగా జగన్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని మరో వాదన. కాపు కోటాతో పాటుగా మహిళకు ఇవ్వాలనకుంటే వంగా గీతకు తొలి ప్రాధాన్యత దక్కే ఛాన్స్ ఉంది. ఇక, ఎస్సీ కేటిగిరీలో మహిళకు ఇవ్వాలని నిర్ణయిస్తే అమలాపురం ఎంపీ చింతా అనూరాధకు అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, ఏపీ కేబినెట్ లో మాత్రం బీజేపీకి అవకాశాలు లేనట్లే. ఏపీ కేబినెట్ లో 25 మంత్రి పదవులు ఉండగా..మొత్తం ఇప్పటికే భర్తీ అయ్యాయి. బీజేపీ కోసం ఉన్నవారిలో ఇద్దరినీ రాజీనామా చేయించి ఇచ్చే పరిస్థితి లేదు.
పవన్..చంద్రబాబు కు చెక్ పెట్టేందుకే..
కొద్ది కాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే తనకు అమిత్ షాతో ున్న సాన్నిహిత్యం గురించి మాట్లాడుతున్నారు. అదే సమయంలో టీడీపీ..జనసేన నేతలు వైసీపీ నేతల మీద మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. హిందూ వ్యతిరేక ముద్ వేసే ప్రయత్నం జరుగుతోంది. దీంతో..కేంద్ర ప్రభుత్వంలో చేరటం ద్వారా ఈ ప్రచారానికి..ప్రత్యర్ధి నేతలను చెక్ పెట్టవచ్చనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో.. వైసీపీకి బలమైన ఓట్ బ్యాంక్ గా ఉన్న మైనార్టీ..దళిత ఓట్ బ్యాంకు మీద ఈ నిర్ణయం కారణంగా ఎటువంటి ప్రభావం పడకుండా వారికి ముఖ్యమంత్రి గట్టి హామీ ఇస్తారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుందని సమాచారం. దీంతో..ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ సమయంలో ఈ అంశం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.