విజయవాడ కోవిడ్ 19 ఆస్పత్రిలో దారుణం... అదృశ్యమైన వృద్దుడు మృతి..
విజయవాడలోని కోవిడ్ 19 ఆస్పత్రిలో వారం రోజులుగా కనిపించకుండా పోయిన వసంతరావు అనే వృద్దుడి ఆచూకీ లభ్యమైంది. అయితే అదే ఆస్పత్రిలో ఆ వృద్దుడు మృతదేహమై కనిపించడం గమనార్హం. దీంతో ఆయన భార్య ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. తన భర్త ఆచూకీ చెప్పాలని ఎన్నిసార్లు ఆస్పత్రి సిబ్బంది చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నెల 24వ తేదీన వసంతరావును ఆయన భార్య ధనలక్ష్మి విజయవాడలోని కోవిడ్ 19 ఆస్పత్రిలో చేర్పించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆస్పత్రిలో చేర్చారు. పల్స్ పడిపోతుందని... ఆక్సిజన్ పెట్టాలని చెప్పి ఆ వృద్దుడిని లోపలికి తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత నుంచి ఆయనకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలియరాలేదు.
ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉన్న ధనలక్ష్మిని సిబ్బందికి ఇంటికి పంపించేశారు. మరుసటిరోజు ఆస్పత్రికి వెళ్లగా.. వసంతరావు కనిపించట్లేదని పిడుగు లాంటి వార్త చెప్పారు. నాలుగు రోజులు ఆస్పత్రి సిబ్బంది చుట్టూ తిరిగినా నిర్లక్ష్య సమాధానమే వినిపించడంతో... చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపారు. అలా వారం రోజులు గడిచిపోయాక.. శుక్రవారం(జూలై 3) అదే ఆస్పత్రిలో వసంతరావు మృతదేహాన్ని సిబ్బంది గుర్తించడం గమనార్హం.