కృష్ణాజిల్లాలో విచిత్ర దొంగతనం- 500కే టీవీ అమ్మకం- విచారణలో షాకింగ్ కారణాలు
ఇళ్లలోనో, గుళ్లలోనో, రహదారులపైనో దొంగతనాలు, దోపిడీలు చేసే దొంగల్ని చూస్తూనే ఉంటాం. కానీ విచిత్రంగా కృష్ణాజిల్లాలో ఓ వాహనం నుంచి టీవీలు కొట్టేసి వాటిని రూ.500 కే విక్రయిస్తున్న దొంగలు పోలీసులకు పట్టుబట్టారు. అనుమానంతో ప్రశ్నించి దొంగల్ని పట్టుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. దీంతో వారి నుంచి సదరు టీవీల్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఏపీలోని కృష్ణా జిల్లాలో ఈ విచిత్రమైన దొంగతనం బయటపడింది. రూ.500కే టీవీ అమ్ముతుంటే పోలీసులకు అనుమానం వచ్చింది.. తీరా నిందితుల్ని అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే దిమ్మ తిరిగే విషయాలు తెలిశాయి. జగ్గయ్యపేట మండలం గౌరవరం హైవేపై రూ.500కే టీవీని అమ్మేందుకు వీరు ప్రయత్నించారు. అంత తక్కువ ధరకు టీవీ విక్రయించేందుకు ప్రయత్నించడంతో అనుమానం వచ్చింది. వెంటనే టీవీ అమ్ముతున్న వారిని పట్టుకున్నారు..
విజయవాడ సమీపంలోని ఎనికేపాడులో ఉన్న ఎల్జీ షోరూమ్ నుంచి భీమవరం పంపేందుకు ఎలక్ట్రానిక్ వస్తువుల ఆటోను లోడ్ చేశారు. దీనిపై యూపీకి చెందిన వ్యక్తుల కన్ను పడింది.. లోడ్ చేసిన వస్తువుల్ని దొంగిలించి అక్కడి నుంచి పారిపోయారు. ఎనికేపాడులో దొంగిలించిన వాటిని హైదరాబాద్ తీసుకు వెళ్దామని అనుకున్నారు. గౌరవరం దగ్గరకు రాగానే వస్తువులు తీసుకెళ్తున్న వాహనం డీజిల్ అయిపోయింది. దీంతో టీవీని రూ.500లకు అమ్మి బయటపడదామని ప్రయత్నించారు. చివరికి అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.9 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.