ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు: టీడీపీ బీసీ నేతల పిటీషన్పై
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లను కల్పించడానికి జగన్ సర్కార్ తీసుకున్న చర్యలకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో పుల్స్టాప్ పడింది. స్థానిక సంస్థల్లో బీసీ వర్గాల అభ్యర్థులకు 59 శాతం వరకు టికెట్లను ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలకు బ్రేక్ పడింది. బీసీ అభ్యర్థల రిజర్వేషన్ 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ఇవే తరహా పిటీషన్లపై ఇదివరకు చేపట్టిన విచారణ సందర్భంగా ఇచ్చిన తీర్పులకు లోబడి దీన్ని వెలువరించినట్లు పేర్కంది.
రిజల్ట్స్ డే: జగన్కు కొత్త తలనొప్పి: కరోనా కాలంలో వైసీపీ విజయోత్సవాలు.. వారం రోజుల పాటు
59 శాతానికి బీసీల రిజర్వేషన్..
స్థానిక సంస్థల్లో బీసీ అభ్యర్థులకు జగన్ ప్రభుత్వం 59 శాతం వరకు కోటాను కల్పించిన విషయం తెలిసిందే. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీ రాజ్లకు నిర్వహించబోయే ఎన్నికల్లో దీనికి అనుగుణంగా టికెట్లను ఇచ్చి, బీసీ అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపాలని భావించింది. ఈ ప్రయత్నాలను సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ను దాఖలు చేశారు.
టీడీపీ నేతల పిటీషన్..
టీడీపీకి చెందిన శ్రీకాకుళం లోక్సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, మాజీమంత్రి కొల్లు రవీంద్ర, పల్లా శ్రీనివాసులు తదితరులు సుప్రీంకోర్టులో పిటీషన్ను దాఖలు చేశారు. బీసీలకు అత్యధిక సీట్లను కేటాయించడం రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 48.13 శాతం వరకే బీసీలు ఉన్నారని, వారికోసం 59 శాతం వరకు రిజర్వేషన్లను కల్పించడం సరికాదని వాదించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వారు పిటీషన్లో విజ్ఙప్తి చేశారు.
50 శాతానికి మించకుండా..
టీడీపీ నేతలతో పాటు కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్ రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన రామాంజనేయులు ఇదే అంశంపై వేర్వేరుగా పిటీషన్లను దాఖలు చేశారు. వాటన్నింటినీ ఒకే పిటీషన్ కింద సుప్రీంకోర్టు విచారించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ పిటీషన్పై విచారణ నిర్వహించింది. తీర్పును వెలువరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదంటూ ఇదివరకే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పిటీషనర్లు వాదించారు. రాష్ట్రంలో బీసీల జనాభా మొత్తం కలిపినా 50 శాతం లేదని పేర్కొంది. 48.13 శాతమే ఉండటం వల్ల రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని పేర్కొంది.
2010 నాటి తీర్పుకు లోబడి..
2010లో దీనికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇచ్చిందని, దాన్ని ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని, సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించేలా వ్యవహరిస్తోందని తమ పిటీషన్లలో పేర్కొన్నారు. దీనిపై ఇరు పక్షాల వాదోపవాదాలను ఆలకించిన తరువాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. గతంలో తాము ఇదే న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు లోబడి తాము తమ నిర్ణయాన్ని వెల్లడిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ ఇదివరకు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.