రాజధాని సస్పెన్స్ కంటిన్యూ..తేల్చని ప్రభుత్వం : ఏ ఒక్క సామాజిక వర్గానిదీ కాదు : బొత్సా సేమ్ డైలాగ్..
ఏపీ రాజధాని అమరావతి కొనసాగింపు పైన సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రాజధాని పైన సమీక్ష ద్వారా దీనికి ఒక ముగింపు వస్తుందని అందరూ ఆశించారు. అయితే, ముఖ్యమంత్రి సమీక్షలో రాజధానిలో నిర్మాణాల పురోగతి..బ్యాంకు గ్యారెంటీలు..ఆర్దిక నిర్వహణ పైనే చర్చ సాగింది. రాజధాని పైన జరుగుతున్న చర్చ గురించి ప్రస్తావించ లేదు. రైతులకు చెల్లించాల్సిన కౌలు.. స్థలాల కేటాయింపు మీద చర్చ జరిగింది. సమీక్ష అనంతరం బొత్సా తన పాత వ్యాఖ్యలనే మరో సారి చెప్పుకొచ్చారు. కొన్ని నిర్మాణాల మీద రివర్స్ టెండరింగ్ కు వెళ్లే అంశం మీద చర్చ జరిగినట్లు సమాచారం. అయితే, అందరి అంచనాలకు భిన్నంగా రాజధాని మార్పు వ్యవహారం మీద రచ్చ మరి కొంత కాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిని బహిర్గతం చేస్తా..!
సమీక్ష ముగిసింది..నిర్ణయం మాత్రం రాలేదు
అమరావతి రాజధానిగా కొనసాగింపు వ్యవహారం పైన వారం రోజులుగా సాగుతున్న చర్చకు ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు ముగింపు ఇస్తారనే అంచనాలు తల కిందులయ్యాయి. ముఖ్యమంత్రి వద్ద జరిగిన రాజధాని సమీక్షలో సాధారణ అంశాలకే పరిమితం అయ్యారు. హ్యాపీ నెస్ట్ బుకింగ్ లు.. వాటి నిర్మాణానికి అంచనాల పైన ప్రధానంగా చర్చ సాగింది. వీటి పైన మరో సారి చర్చించి అవసరమైతే రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలనే ఆలోచన చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో రైతుల సమస్యల పైన చర్చించారు. రాజధానికి మొత్తం 64 వేల మంది రైతులు భూములు ఇచ్చారని అధికారులు వివరించారు. అందులో 43 వేల మంది రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరిగిందని, మిగతా స్థలాల రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉందని తెలిపారు. రైతులకు కౌలు బకాయిలు ఇస్తున్నామని... రేపటి నుంచే కౌలు చెల్లింపులు జరపనున్నామని ముఖ్యమంత్రికి వివరించారు.
బొత్సా నోట సేమ్ డైలాగ్..
సమీక్ష అనంతరం బొత్సా మరో సారి తన సేమ్ డైలాగ్ లునే వినిపించారు. రాజధాని ప్రాంతానికి సంబంధించి ఇంకా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని బొత్స అన్నారు. సమీక్షలో రాజధాని అంశంపై వాస్తవాలు పరిశీలించామని తెలిపారు. ముంపు సమస్య చర్చకు రాలేదన్నారు. రాజధాని విషయంలో ఎవరికీ అనుమానల్లేవని పేర్కొన్నారు. రాజధాని గురించి ఎవరో ఏదో చెబితే తనకేంటి సంబంధం అని మంత్రి బొత్సా ఎదురు ప్రశ్నించారు. రాజధానికి సంబంధించి రూ.35వేల కోట్లతో టెండర్లు పిలిచారని, ఆర్థిక పరిస్థితులు చూసి ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామని బొత్స వ్యాఖ్యానించారు. రాజధాని 5 కోట్ల మంది ప్రజలదని, ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినది కాదని మరోసారి వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదన్నారు. ఏపీలోని 13 జిల్లాల అభివృద్ధి కి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసారు. ఏ ఒక్క ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందనే భావన రాకుండా పాలన చేస్తామని వెల్లడించారు. రాజధానిలో నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉందని..75 శాతం పూర్తయిన వాటిని కొనసాగిస్తామని ప్రకటించారు. మిగిలిన వాటి పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
ఎవరో చేసే వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు..
ఏ పార్టీ వారో చేసే వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని బొత్సా స్పష్టం చేసారు. అమరావతి ప్రాంతలో 35 వేల కోట్లతో పనులకు పిలిచిన టెండర్లకు బ్యాంకు టై అప్ లేదని వివరించారు. ఇప్పటికే టెండర్లను రద్దు చేసామన్నారు. రాష్ట్ర ఆర్దిక పరిస్థితికి అనుగుణంగా నిర్మాణాల విషయంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసారు. అమరావతిలోని రైతులకు..కూలీలకు పెండింగ్ బకాయిలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాజధాని పైన తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తేల్చి చెప్పారు. చంద్రబాబు చెప్పినట్లుగా రాజధాని స్వయం ఆర్దిక ప్రాజెక్టు అయితే వేల కో్లు రుణాలు కోసం ఎందుకు ప్రయత్నించారని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సినవి ఉన్నాయన్నారు. భరత్ చేసిన ఆరోపణలు తప్పని..జీవో కాపీలను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి వద్ద చర్చ జరిగిన విషయాలనే తాను చెబుతున్నానని.. ఎవరో చేసిన వ్యాఖ్యలను తాను సమాధానం చెప్పనని బొత్సా స్పష్టం చేసారు.