ఆ విషయంలో విశాఖ కంటే విజయవాడే బెటర్: ఆరో స్థానంలో ఏపీ: టాప్-10 లిస్ట్
విజయవాడ: జాతీయ స్థాయిలో స్వచ్ఛతా ప్రమాణానలను పాటించిన రాష్ట్రాలు, నగరాల జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందట ప్రకటించింది. జాతీయ స్థాయిలో పలు కేటగిరీల కింద నగదు అవార్డులకు ఎంపికైన నగరాలు, పట్టణాల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రాల ర్యాంకులను కూడా ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ జాబితాలో ఏపీకి ఆశించిన స్థాయిలోనే ర్యాంకులు దక్కాయి. టాప్ కేటగిరీలో మన రాష్ట్రంలోని రెండు నగరాలకు చోటు దక్కింది. టాప్-10లో విజయవాడ, విశాఖపట్నం నిలిచాయి.
విజయవాడ నాలుగో ర్యాంకు, విశాఖపట్నం తొమ్మిదో ర్యాంకును సాధించాయి. రెండో కేటగిరలో తిరుపతికి చోటు దక్కింది. అలాగే- స్వచ్ఛ ప్రమాణాలను పాటించిన రాష్ట్రాల జాబితాలో ఏపీ ఆరో స్థానంలో నిలిచింది. వందకు పైబడిన అర్బన్ లోకల్ బాడీలు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. ఈ కేటగిరీలో ఛత్తీస్గఢ్ టాప్లో నిలిచింది. రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచాయి. గుజరాత్, పంజాబ్ నాలుగు, అయిదు స్థానాలను దక్కించుకున్నాయి. వంద యూఎల్బీలకు దిగువన ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఎనిమిదో ర్యాంకును సాధించింది.
10 లక్షల రూపాయలకు పైగా నగదు అవార్డును అందుకోనున్న నగరాల జాబితాలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ అగ్రస్థానంలో నిలిచింది. ఇండోర్ వరుసగా టాప్ప్లేస్ను కైవసం చేసుకుంటూ వస్తోంది. ఇండోర్ తరువాత సూరత్, మూడో స్థానంలో నవీ ముంబై ఉన్నాయి. ఇండోర్-5647.56 స్కోర్ సాధించింది. సూరత్-5516.59, నవీముంబై-5467.89 పాయింట్లను సాధించాయి. 5270.32 పాయింట్లతో విజయవాడ నాలుగో స్థానంలో నిలిచింది. అహ్మదాబాద్, రాజ్కోట్, భోపాల్, విశాఖపట్నం, వడోదర తొలి 10 నగరాల జాబితాలో ఉన్నాయి.
ఈ కేటగిరీలో మొత్తం 20 నగరాలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఏపీకి చెందిన రెండు ప్రముఖ నగరాలు టాప్టెన్లో నిల్చోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 10 లక్షల రూపాయల లోపు నగదును బహుమతిని అందుకోనున్న నగరాల జాబితాలో తిరుపతికి చోటు దక్కింది. తిరుపతి ఆరోస్థానంలో నిలిచింది 5142.76 పాయింట్లు దక్కాయి.
ఈ కేటగిరీలో అంబికాపూర్ అగ్రస్థానంలో నిలవగా.. మైసూరు, న్యూఢిల్లీ, చంద్రాపూర్, ఖర్గోన్ తొలి అయిదు స్థానాల్లో ఉన్నాయి. తిరుపతి, జంషెడ్పూర్, గాంధీనగర్, ధులె, రాజ్నంద గావ్ తొలి పదిలో ఉన్నాయి.