తహశీల్దార్ వనజాక్షిపై అమరావతి రైతులు దాడికి యత్నం: తాడేపల్లిలో ఉద్రిక్తత..
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో తహశీల్దార్ వనజాక్షికి చేదు అనుభవం ఎదురైంది. ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి గుంటూరు జిల్లాలోని తాడేపల్లికి చేరుకున్న ఆమెపై స్థానికులు దాడికి ప్రయత్నించారు. ఆమెను చుట్టుముట్టారు. వాగ్వివాదానికి దిగారు. సకాలంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనతో కొత్తూరు తాడేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల సహకారంతో వనజాక్షి సంఘటనా స్థలం నుంచి బయట పడ్డారు.
వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా బదలాయించి వాటిని పేద కుటుంబీకులకు పంపిణీ చేయాలని వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి ఆదేశాలను జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి రెవెన్యూ అధికారులు సోమవారం మధ్యాహ్నం కొత్తూరు తాడేపల్లిలో సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొనడానికి తహశీల్దార్ వనజాక్షి అక్కడికి చేరుకోగా.. రైతులు ఆమెను అడ్డుకున్నారు.
వ్యవసాయ భూములను ఇళ్ల పట్టాలుగా బదలాయించడానికి తాము అంగీకరించట్లేదని అన్నారు. తమ పొలాలను పేదలకు ఎలా ఇస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వనజాక్షి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను చేసినట్లు తెలుస్తోంది. ప్రజాభిప్రాయ కార్యక్రమానికి వచ్చిన వారు నిజమైన రైతులు కారని, వారంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటూ వనజాక్షి వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు వచ్చాయి. వారంతా బయటికి వెళ్లిపోవాలని ఆదేశించారని తెలుస్తోంది.
Recommended Video
ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహించిన స్థానికులు దాడికి దిగారు. వనజాక్షిని చుట్టుముట్టారు. వాగ్వివాదానికి దిగారు. తమ వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకోవడానికి నువ్వెవరివంటూ మండిపడ్డారు. దాడికి యత్నించారు. సకాలంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. స్థానికులను చెదరగొట్టారు. వనజాక్షిని సురక్షితంగా బయటికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో కొత్తూరు తాడేపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.