వృషభ రాజుకు కన్నీటి వీడ్కోలు.. ఘనంగా అంత్యక్రియలు
విజయవాడ : సొంత కుటుంబ సభ్యులను పట్టించుకోని ఈ రోజుల్లో.. వృషభానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. గన్నవరంకు చెందిన రైతు కాసరనేని రాజా ఓ వృషభాన్ని పోషిస్తున్నారు. దానికి అల్లారుముద్దుగా పోతురెడ్డిపల్లి అనే నామకరణం చేశారు. అయితే ఈ వృషభ రాజు జాతీయ స్థాయిలో నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొని 122 పతకాలు సాధించడం విశేషం. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎద్దుల పోటీ జరిగినా ఈ వృషభ రాజు అక్కడ తలపడాల్సిందే. విజయం సాధించాల్సిందే. అలాంటి వృషభ రాజు కన్నుమూయడం.. తమకు దూరం కావడం.. రాజా కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఈ వృషభ రాజు ఏపీ ఫేమస్
ఈ వృషభ రాజు గురించి ఏపీలో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎద్దుల పోటీ అంటే చాలు పోతురెడ్డిపల్లిగా పేరు పొందిన ఈ వృషభ రాజు గుర్తుకు రావాల్సిందే. అంతలా పేరు గాంచిన ఈ వృషభ రాజుపై వేలాది మంది అభిమానం చూపిస్తారు. అలాంటి వృషభ రాజు కన్నుమూసింది. దాంతో యజమాని కాసరనేని రాజా కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. ఇన్నాళ్లుగా తాము దానితో పెంచుకున్న అనుబంధం ఇలా అర్ధాంతరంగా ముగుస్తుందని అనుకోలేదని వాపోతున్నారు.
అంతా విషాదమే.. 6 పాయింట్లు.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొండా ట్వీట్ల యుద్దం..!
తొమ్మిది సంవత్సరాల అనుబంధం.. ఇలా అర్ధాంతరంగా..!
ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది సంవత్సరాలుగా ఈ వృషభ రాజుతో ఆ కుటుంబ సభ్యులకు అనుబంధముంది. తమతో పాటు దాన్ని కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూశారే తప్ప ఏనాడు కూడా అది జంతువు అనే కోణంలో చూడలేదు. ఆ విధంగా మూగజీవైన ఈ వృషభ రాజుపై అమితమైన ప్రేమ కురిపించారు. ఎక్కడా ఎద్దుల పోటీలు జరిగినా దాన్ని బరిలోకి దించేవారు. అయితే ఏ పోటీల్లో పాల్గొన్నా.. విజయం సాధించడమే తప్ప ఓటమి ఎరుగని వృషభ రాజుగా పేరుగాంచింది.
ఘనంగా అంత్యక్రియలు.. జంతు ప్రేమికులు కూడా తోడయ్యారు
అయితే అది ఆకస్మాత్తుగా కన్ను మూయడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తొమ్మిది సంవత్సరాలుగా దానితో పెంచుకున్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. అంతేకాదు స్థానికంగా ఉన్న జంతు ప్రేమికులతో కలిసి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. మనుషులకు ఏవిధంగా అంతిమ క్రియలు చేస్తారో అదే విధంగా ఈ వృషభ రాజుకు కన్నీటి వీడ్కోలు పలికారు. పుర వీధుల గుండా అంతిమ యాత్ర నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇటీవల దానికి నలతగా ఉందని వైద్యులను పిలిపించి చికిత్స అందించినప్పటికీ బతకలేదని.. వృషభ రాజుతో తమ అనుబంధం తెగిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు.