జగన్ పాలన మూడేళ్లే..జమిలి ఎన్నికల ఎపెక్ట్: ఒక్క ఛాన్స్..ఇదే లాస్ట్ ఛాన్స్: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో చర్చ జరిగిన జమిలి ఎన్నికల అంశాన్ని మరో సారి తెర మీదకు తీసుకొచ్చారు. జగన్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారని...ఇదే లాస్ట్ ఛాన్్ అని విమర్శించారు. అదే సమయంలో జమిలి ఎన్నికల కారణంగా మూడేళ్లు మాత్రమే జగన్ అధికారంలో ఉంటారని జోస్యం చెప్పారు. ప్రతీ కార్యకర్త పార్టీకి దూరమైన వారికి తిరిగి దగ్గర చేసేందుకు వీలుగా పట్టు దలతో పని చేయాలని సూచించారు. కొంత మంది పనుల కోసం పార్టీలోకి వస్తారని..పూర్తయిన తరువాత పార్టీని వీడి వెళ్తారని పరోక్షంగా సమీక్షలకు దూరంగా నేతల గురించి వ్యాఖ్యానించారు. నేతలు ఎంత మంది వెళ్లినా..టీడీపీకి కార్యకర్తలే బలమని చెప్పుకొచ్చారు. జగన్ నీచాతి నీచమైన రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
జగన్ వంద రోజుల పాలనకు వంద మార్కులు: నడిపించేవాడు కావాలి : జేసీ సంచలనం..!!
చంద్రబాబు నోట జమిలి ఎన్నికల మాట..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సడన్ గా జమిలి ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. కాకినాడలో పార్టీ సమీక్షల్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. జమిలి ఎన్నికల పైన కేంద్రం చర్చలు చేస్తుందని.. అదే జరిగితే మూడేళ్ల పాటు మాత్రమే ఏపీలో ప్రభుత్వం ఉంటుందని చెప్పుకొచ్చారు. 2022లోనే తిరిగి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. జగన్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారని..ఇదే చివరి ఛాన్స్ అని వ్యాఖ్యానించారు. మూడేళ్లలో తిరిగి ఎన్నికలు వస్తాయని..ప్రటీ టీడీపీ కార్యకర్త సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. పార్టీకి దూరమైన వర్గాలను తిరిగి దగ్గర చేసుకొనేలా ప్రయత్నాలు చేయాలని సూచించారు. పార్టీ నుండి వెళ్లే నేతలు గురించి చంద్రబాబు వ్యాఖ్యలు చేసారు. ఎవరి పేరు ప్రస్తావించకుండా కొంత మంది తమ పనుల కోసం పార్టీలోకి వస్తారని..పూర్తవ్వగానే పార్టీ వీడి వెళ్లిపోతారని బాబు కామెంట్ చేసారు. అటువంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు పేర్కొన్నారు.
జగన్ నీచాతి నీచమైన రాజకీయం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ పైన చంద్రబాబు తీవ్రంగా మండి పడ్డారు. జగన్ చేస్తున్నవి నీచాతి నీచమైన రాజకీయాలంటూ ఫైర్ అయ్యారు. ఇంతటి రాక్షస పాలన చరిత్రలో చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ జిల్లాల నుంచి వచ్చినవారు కూడా ఇలా ప్రవర్తించలేదని వ్యాఖ్యానించారు. వైఎస్ కూడా ఫ్యాక్షన్ రాజకీయాలను కడపకే పరిమితం చేసేవారని తెలిపారు. ఒకవేళ కడప జిల్లా దాటి వస్తే వైఎస్ పెద్దమనిషిలానే రాజకీయాలు చేసేవారని చెప్పారు. కానీ జగన్ మాత్రం కక్షపూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారన్నారు. పులివెందుల పంచాయితీ రాష్ట్రమంతా రుద్దాలని చూస్తున్నారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో కడప రౌడీయిజానికి నిరసనగానే విశాఖ ప్రజలు వైఎస్.విజయలక్ష్మిని ఓడించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం విధ్వంసం నడుస్తోందన్నారు. ఆఖరుకు తనను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారన్నారు. తన పర్యటనలకు భద్రత తగ్గించి ఇబ్బందిపెడుతున్నారని చెప్పుకొచ్చారు. పోలవరం, అమరావతిపై ఆటలాడుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లను బెదిరించి కాంట్రాక్టులు రద్దుచేసి పంపేస్తారా అని నిలదీసారు.
ప్రభుత్వాన్ని నెంబర్ ఒన్ చేసినట్లే పార్టీని సైతం ...
తన హయాంలో పాలన మీద ఫోకస్ చేయటం కారణంగా పార్టీని సరిగ్గా పట్టించుకోలేదని చంద్రబాబు అంగీకరించారు. తన పాలనలో ఏపీని నంబర్ ఒన్ స్థానంలో ఉంచిన తనకు పార్టీని నెంబర్ వన్ గా తీర్చి దిద్దటం పెద్ద సమస్య కాదని చెప్పుకొచ్చారు. పార్టీలో కొందరు నేతలు వెళ్లినంత మాత్రాన ఎటువంటి నష్టం లేదన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పార్టీకి బలమైన కార్యకర్తలు..ప్రజల మద్దతు ఉందని.. ప్రభుత్వం మీద వంద రోజుల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని చెప్పారు. నేతలంగా సమిష్టిగా పార్టీ కోసం పని చేయాలని సూచించారు. వైసీపీకి కేడర్ లేదని..ఇతర పార్టీ నుండి వచ్చిన వారు మినహా వైసీపీలో ఎవరున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారి పైన కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలవరం నిలిచిపోతే ఉభయ గోదావరి జిల్లాలు ఏమవుతాయని చంద్రబాబు ప్రశ్నించారు.